అమెరికా, ఇరాన్ వార్ కు ఎండ్ కార్డ్ పడిందా?

posted on: May 25, 2026 3:59PM

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత మూడు నెలలుగా కొనసాగుతున్న   సైనిక, దౌత్యపరమైన ఉద్రిక్తతలు  ఒక ముగింపునకు వచ్చేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఉన్నత స్థాయి చర్చలు సఫలమైతే, ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఈ ఘర్షణ వాతావరణం శాంతి ఒప్పందంతో ముగిసే అవకాశం ఉంది. ఈ తాజా శాంతి ప్రతిపాదనల్లో భాగంగా రెండు దేశాలు కీలక నిబంధనలకు అంగీకరించేలా ఒక ముసాయిదా అవగాహన ఒప్పందం  సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.

ఈ ఒప్పందంలోని ప్రాథమిక నిబంధనల ప్రకారం.. ఇరుపక్షాలు 60 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు  అంగీకరించనున్నాయి. ఈ సమయంలో అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన  స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్'  జలమార్గం తిరిగి పూర్వస్థితికి చేరుకుంటుంది. ఇరాన్ ఈ జలమార్గంలో అమర్చిన సముద్రపు మైన్లను తొలగించడంతో పాటు... వాణిజ్య నౌకల నుంచి ఎలాంటి టోల్ వసూలు చేయకుండా ఉచిత రవాణాకు అనుమతించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రతిఫలంగా  అమెరికా ఇరాన్ రేవులపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయడమే కాకుండా...  60 రోజుల పాటు ఇరాన్ స్వేచ్ఛగా చమురు విక్రయించుకునేలా ప  ఆంక్షల సడలింపులను ప్రకటించనుంది.

ఈ శాంతి చర్చల్లో ఇరాన్ అణు కార్యక్రమం అత్యంత కీలకమైన అంశంగా మారింది. అమెరికా చిరకాల డిమాండ్‌కు తలొగ్గి, ఇరాన్ తన వద్ద ఉన్న  శుద్ధి చేసిన  యురేనియం నిల్వలను  వదులుకోవడానికి ప్రాథమికంగా అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం శనివారం (మే 23) నాటి తన ప్రకటనలో ఇరాన్‌తో ఒప్పందం దాదాపు ఖరారైనట్లేనని సంకేతాలు ఇచ్చారు. అయితే..  గతంలోనూ పలుమార్లు చర్చలు చివరి దశకు వచ్చి విఫలమవడంతో, ఇరు దేశాల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సి ఉంటుంది.

గడిచిన మూడు నెలల యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన, సహజ వాయువు ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా జరిగే రవాణా నిలిచిపోవడంతో మార్కెట్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతానికి చర్చలు సజావుగా సాగుతూ హార్ముజ్ జలమార్గం తాత్కాలికంగా తెరుచుకున్నప్పటికీ, రాబోయే తుది చర్చల ఫలితాన్ని బట్టే ఈ యుద్ధానికి శాశ్వత ముగింపు దక్కుతుందా లేదా అనేది తేలనుంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...