శక్తిశాట్ మిషన్‌లో తూర్పు తేజం జెస్సీ.!

posted on: Jul 21, 2026 6:15AM

అనంత విశ్వంలో ఉపగ్రహాలు ఎలా పనిచేస్తాయి? చిన్నప్పటి నుంచీ అందరిలోనూ ఉండే ఆసక్తి.    గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి, ఆకాశమే హద్దుగా అంతరిక్ష విజ్ఞాన రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది ఒక సామాన్య బాలిక. అంతరిక్ష విజ్ఞాన రంగంలో బాలికలను విశేషంగా ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా  శక్తిశాట్ మిషన్  ను నిర్వహిస్తోంది. ఈ అంతర్జాతీయ స్థాయిలో సాగిన పోటీలలో తన అద్భుత ప్రతిభతో మెరిసి, దేశానికే గర్వకారణంగా నిలిచింది తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని కె. జెస్సీ.

ధవళేశ్వరం ప్రాంతానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కె.జెస్సీ అంతరిక్ష విజ్ఞాన రంగంలో విశేష ప్రతిభ కనబరిచి, కేంద్ర ప్రభుత్వం,  అంతర్జాతీయ సంస్థలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక  శక్తిశాట్  మిషన్‌కు ఎంపికయ్యారు. అంతరిక్ష పరిశోధనలు, రాకెట్ సైన్స్, ఉపగ్రహాల రూపకల్పన పట్ల చిన్నతనం నుంచే ఆసక్తి పెంపొందించుకున్న జెస్సీ..  కఠినమైన వివిధ ఎంపిక దశలను దాటుకుని ఈ ఘనత సాధించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని సాధించిన విజయం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు, జిల్లా అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ   గ్లోబల్ మిషన్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 108 దేశాలకు చెందిన 12 వేల మందికి పైగా విద్యార్థినులకు అంతరిక్ష సాంకేతికత, ఉపగ్రహ ఇంజనీరింగ్, విజ్ఞాన శాస్త్రాలపై ఆన్‌లైన్ ద్వారా ప్రాథమిక శిక్షణ అందించారు. ఈ శిక్షణ అనంతరం నిర్వహించిన పరీక్షలు, ప్రాజెక్ట్ మూల్యాంకన ఆధారంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 300 మంది బాలికలను తదుపరి దశకు ఎంపిక చేశారు. ఆ తర్వాత చోటుచేసుకున్న తుది ఎంపిక ప్రక్రియలో ఇండియా నుంచి  20 మంది విద్యార్థినులు   స్థానం సంపాదించగా, వారిలో  ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి జెస్సీ నిలవడం  గర్వకారణం.

సామాన్య కుటుంబ నేపథ్యం కలిగిన జెస్సీ తండ్రి కందుల శ్రీను వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, తల్లి అరుణ గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కుటుంబంలో ఆర్థిక ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ, చదువులో ఎప్పుడూ ముందుండే జెస్సీ.. ఈ స్పేస్ ప్రాజెక్ట్‌లో అంతర్జాతీయ స్థాయి పోటీని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఉపగ్రహ విజ్ఞానం, రాకెట్ ప్రయోగాల సిద్ధాంతాలను ఆన్‌లైన్ ద్వారా ఆకలింపు చేసుకుంటూ, ఉపాధ్యాయుల సలహాలతో ప్రాజెక్ట్ లోని ప్రతి దశనూ విజయవంతంగా పూర్తి చేశారు.  ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సరియైన దిశానిర్దేశం లభిస్తే అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డులు సృష్టించగలరనడానికి జెస్సీ ఒక నిదర్శనం.  తమ ఆర్థిక పరిస్థితి పరిమితంగా ఉన్నందున, రాబోయే రోజుల్లో తమ కుమార్తె ఉన్నత విద్యకు, శిక్షణా పర్యటనలకు దాతలు, ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరింత ముందుకు వెళ్తుందని జెస్సీ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 శక్తిశాట్ మిషన్ కార్యక్రమాన్ని స్పేస్ కిడ్జ్ ఇండియా, నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని అటల్ ఇన్నోవేషన్ మిషన్  సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అంతరిక్ష విజ్ఞానం, స్పేస్ టెక్నాలజీ, ఉపగ్రహ డేటా ప్రాసెసింగ్ వంటి అంశాల్లో బాలికల ప్రాతినిధ్యాన్ని పెంచడం, వారిలో పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందించడమే ఈ ప్రాజెక్ట్   ముఖ్య ఉద్దేశం. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం విద్యార్థుల కోడింగ్ సామర్థ్యం, స్పేస్ సైన్స్ పరిజ్ఞానం,  ప్రాజెక్ట్ ఐడియాల ప్రాతిపదికగా నిర్వహించారు.

శిక్షణ క్రమంలో భాగంగా తుది దశకు ఎంపికైన జెస్సీతో పాటు ఇతర విద్యార్థినులు ఆగస్టు 23 నుంచి అక్టోబర్ వరకు  న్యూఢిల్లీలో జరిగే ప్రత్యక్ష శిక్షణా శిబిరంలో పాల్గొంటారు. ఈ   శిక్షణలో విద్యార్థులు స్వయంగా ఉపగ్రహ నిర్మాణం, పేలోడ్ డిజైనింగ్, సాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్,  మిషన్ కంట్రోల్ హ్యాండ్లింగ్‌లలో ప్రాక్టికల్ అవగాహన సాధిస్తారు. శాస్త్రవేత్తల ప్రత్యక్ష పర్యవేక్షణలో విద్యార్థులే స్వయంగా సాటిలైట్ భాగాలను అసెంబుల్ చేయడం ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకత.

అంతేకాకుండా.. ఢిల్లీలో ప్రత్యక్ష ఉపగ్రహ రూపకల్పన ప్రక్రియ పూర్తయిన అనంతరం, ఈ విద్యార్థులు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నిర్వహించే నిజమైన ఉపగ్రహ ప్రయోగాన్ని శ్రీహరికోట లేదా నిర్దేశిత ప్రయోగ కేంద్రం నుంచి ప్రత్యక్షంగా వీక్షించే   అవకాశాన్ని కైవసం చేసుకుంటారు. ప్రయోగ సమయంలో కంట్రోల్ రూమ్ కార్యకలాపాలు, రాకెట్ కౌంట్‌డౌన్, శాటిలైట్ ఆర్బిట్ ఇంజెక్షన్ వంటి సంక్లిష్ట పరిణామాలను శాస్త్రవేత్తల నడుమ ఉండి పరిశీలించే అవకాశం విద్యార్థులకు లభించనుంది. తూర్పుగోదావరి జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి మిషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జెస్సీ ప్రయాణం మరెంతో మంది గ్రామీణ విద్యార్థులకు  ప్రేరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

haktiSat Mission, Dhavaleswaram Jessie, Space Kids India, ISRO Satellite Project, East Godavari Student, NITI Aayog Space Mission

google-ad-img
    Related Sigment News
    • Loading...