భారతీయులకు అమెరికా కల అందని ద్రాక్ష కానుందా..?

posted on: Jul 9, 2016 5:33PM

అమెరికాలో ఉద్యోగం..ఇది కోట్లాది మంది భారతీయ యువతకు ఉన్న కల..మా అబ్బాయి స్టేట్స్‌లో పనిచేస్తున్నాడని చెప్పుకోవాలని సగటు భారతీయ తల్లిదండ్రులకు ఉంటుంది. అయితే ఇక మీదట ఇలాంటి కలలు నెరవేరాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత ఐటీ కంపెనీలు, నిపుణులను నిరోధించడానికి ఉద్దేశించిన "2016- హెచ్-1బీ, ఎల్1 వీసా సంస్కరణల చట్టం" బిల్లును యూఎస్ సెనెట్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టింది. తక్కువ వేతనాలకే పనిచేయడానికి భారత్ సహా ఇతర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న వారితో అమెరికా పౌరులు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి.

 

దీనిపై దృష్టి సారించిన అమెరికా ప్రభుత్వం గతంలో వీసా నిబంధనలను కఠినతరం చేసింది. వీసా ఫీజును గణనీయంగా పెంచడంతో పాటు సంవత్సరానికి 65 వేల వీసాలను మాత్రమే మంజూరు చేయాలని అన్ని దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలను ఆదేశించింది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం రేగడంతో అగ్రరాజ్యం వెనక్కు తగ్గింది. తాజాగా వీసా జారీ ప్రక్రియలోని లోపాలను సవరించాలని అమెరికా నిర్ణయించింది. దీనిలో భాగంగా "2016- హెచ్-1బీ, ఎల్1 వీసా సంస్కరణల చట్టం" బిల్లును రూపొందించింది.  ఈ కొత్త బిల్లు ప్రకారం ఏదైనా కంపెనీ తమ ఉద్యోగుల్లో 50 శాతం కంటే ఎక్కువ మందిని, లేదంటే మొత్తం ఉద్యోగుల్లో సగం కంటే ఎక్కువ మందిని హెచ్-1బి, లేదా ఎల్-1 వీసాదారులతో భర్తీ చేసుకోవడం కుదరదు.

 

పెద్ద ఎత్తున విదేశీ కార్మికుల్ని అమెరికాకు దిగుమతి చేసుకుని, కాస్తంత శిక్షణను ఇచ్చి, ఆ తర్వాత వారిని స్వదేశాలకు పంపించి అక్కడి నుంచే పనిచేయించుకునేలా కంపెనీలను కొత్త నిబంధనలు తాటతీయనున్నాయి.  యాంటీవీసా బిల్లును అధ్యక్షుడు ఒబామా ఆమోదించాలంటే ముందుగా ఈ బిల్లును సెనెట్ ఆమెదించాల్సి ఉంది. 2010లో ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టగా..సెనెట్ దీనిని తిరస్కరించింది. అయితే ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ బిల్లును పాస్ చేయించాలన్న కృతనిశ్ఛయంతో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఉండటంతో బిల్లు పాస్ కాదన్న ప్రశ్నే లేదు.

google-ad-img
    Related Sigment News
    • Loading...