అహ్మదాబాద్ సీరియల్ పేలుళ్ల కేసు.. 38 మందికి మరణశిక్ష ఖరారు చేసిన గుజరాత్ హైకోర్టు.!

posted on: Jul 7, 2026 2:25PM

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన 2008 అహ్మదాబాద్ సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు మంగళవారం (జూలై 7) చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో 38 మంది దోషులకు మరణశిక్ష, మరో 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ 2022లో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు పూర్తిగా సమర్థించింది. దోషులు దాఖలు చేసిన అన్ని అప్పీళ్లను కోర్టు తిరస్కరించింది. జస్టిస్ ఎ.వై. కోగ్జే, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు   తుది తీర్పు  వెలువరించింది. భారత న్యాయ చరిత్రలో ఒకే కేసులో ఇంత పెద్ద సంఖ్యలో నిందితులకు మరణశిక్షను ఉన్నత న్యాయస్థానం ఖరారు చేయడం ఇదే మొదటిసారి. 
 
2008 జూలై 26న గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. గంటా పది నిముషాల వ్యవధిలో నగరంలో  నగరంలోని 20 వేర్వేరు ప్రాంతాలలో 21 బాంబులు పేలాయి. ఈ ఉగ్రదాడిలో 56 మంది  ప్రాణాలు కోల్పోగా, 240 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా క్షతగాత్రులను తరలించే ఆసుపత్రులను కూడా లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడ్డారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ  ఇండియన్ ముజాహిదీన్  ఈ దాడులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.ఈ కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు, 2022 ఫిబ్రవరిలో సంచలన తీర్పు ఇచ్చింది. మొత్తం 49 మందిని దోషులుగా తేల్చింది. వారిలో 38 మందికి ఉరిశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధించింది. ఈ శిక్షల నిర్ధారణ కోసం,  నిందితులు పెట్టుకున్న అప్పీళ్లపై గత కొన్ని నెలలుగా గుజరాత్ హైకోర్టులో విచారణ సాగింది. ప్రత్యేక కోర్టు ఇచ్చిన 7,015 పేజీల సుదీర్ఘ తీర్పును, ఆధారాలను పరిశీలించిన హైకోర్టు.. దిగువ కోర్టు ఇచ్చిన శిక్షలు సరైనవేనని స్పష్టం చేసింది. శిక్ష పడిన వారిలో సిమి మాజీ నేత సఫ్దర్ నాగోరితో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తరప్రదేశ్ తదితర 11 రాష్ట్రాలకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారు.  

11lifeinprision, sensational, verdict, 2008serial blast case, Teluguone

google-ad-img
    Related Sigment News
    • Loading...