గ్రోక్ జోస్యం.. చెప్పినట్లుగానే మొదలైన యుద్దం!

posted on: Mar 2, 2026 8:15AM

యుద్దాలు ఎప్పుడు మొదలవుతాయో కూడా ఆర్టిఫీషియన్ ఇంటలిజెన్స్ (ఏఐ) వెల్లడించడం సంచలనంగా మారింది.  ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. అదే రోజు దాడులు మొదలవుతాయని   ఏఐ చాట్‌బాట్ గ్రోక్ కొన్ని రోజుల కిందటే అంచనా వేయడం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.  

ఇరాన్, అమెరికాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. యుద్ధం తప్పదని కొందరు విశ్లేషకులు అంచనా వేశారు. సరిగ్గా ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో మాత్రం   భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో జెరూసలెం పోస్టు అనే వార్తా పత్రిక చిన్న ప్రయోగాన్ని నిర్వహించింది. అమెరికా దాడిని ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉందో చెప్పాలని పలు చాట్ బాట్స్‌ను కోరింది. ఓపెన్‌ ఏఐ సంస్థకు చెందిన చాట్‌జీపీటీ, గూగుల్‌కు చెందిన జెమిని, ఎలాన్ మస్క్ సారథ్యంలోని ఎక్స్‌ఏఐకి చెందిన గ్రోక్‌, ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్‌ ఏఐల నుంచి సమాధానాలను రాబట్టేందుకు ప్రయత్నించింది.  ఫిబ్రవరి 25న వాటిపై ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.

సాధారణంగా యుద్ధం, రాజకీయాలు వంటి సున్నితమైన అంశాల్లో ఏఐ చాట్‌బాట్స్ బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే స్పందిస్తాయి. ఇక ఊహాజనిత ప్రశ్నలపై స్పందించేందుకు నిరాకరిస్తుంటాయి. ఫలితంగా క్లాడ్ ఏఐ మొదట సమాధానం ఇచ్చేందుకు నిరాకరించింది. ఇతర చాట్‌బాట్స్‌ కూడా కొంత సంశయించాయి. కానీ పలు రకాల ప్రశ్నలు సంధించాక తమ అంచనాలను వెల్లడించాయి. క్లాడ్ , జెమిని వంటి ఏఐ సంస్థలు కాస్త అటుఇటుగా అంచనాల వెల్లడించినప్పటికీ,  గ్రోక్ మాత్రం ఫిబ్రవరి 28న దాడులు మొదలవ్వొచ్చని అంచనా వేసింది. యాదృచ్ఛికంగా అదే రోజున దాడులు ప్రారంభం కావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయం తన దృష్టిలోకి రావడంతో ఎఎక్స్‌ఏఐకి చెందిన గ్రోక్‌ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పగలగడమే మేధో శక్తికి అసలైన నిదర్శనమని వ్యాఖ్యానించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...