రవాణా నిబంధనల ఉల్లంఘనపై సర్కార్ ఉక్కుపాదం : మంత్రి పొన్నం

posted on: Jun 8, 2026 6:42PM

 

తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను మరింత బలో పేతం చేసి, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర రహదారులపై ఓవర్‌లోడింగ్‌తో నడుస్తున్న వాహనాలు, త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. నిబంధనల ఉల్లంఘనలను గుర్తించిన వెంటనే జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే వాహనాలను సీజ్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

చెక్‌పోస్టుల రద్దు తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తనిఖీలను విస్తృతం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాల వారీగా 10 ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు, రాష్ట్ర స్థాయిలో రెండు స్పెషల్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు.

విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేసిన మంత్రి, స్కూల్ బస్సులు, మినీ వ్యాన్‌లకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. అనుమతించిన సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలిస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత వాహనాలను సీజ్ చేయడంతో పాటు విద్యాసంస్థల యాజమాన్యాలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు తెలంగాణలో పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న అంశంపై ప్రత్యేక నిఘా ఉంచాలని మంత్రి సూచించారు. పన్నులు ఎగవేస్తున్న వాహన యజమానులపై భారీ జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే వాహనాలను స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. అలాగే ప్రయాణికుల భద్రత దృష్ట్యా స్లీపర్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం ఉపేక్షించవద్దని, ప్రమాదాలకు కారణమయ్యే నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. సమీక్షా సమావేశంలో వికాస్ రాజ్, ఇలాంబత్రి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...