పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

posted on: Jun 26, 2026 8:34AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.    తాజాగా పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఒకేసారి 42 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు (ఎంపీడీవోలు) డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లుగా (డీడీవోలు) పదోన్నతులు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ   ప్రక్రియకు  పవన్ కల్యాణ్  గ్రీన్ సిగ్నల్  ఇవ్వడంతో .. ఇందుకు సంబంధించిన సీనియారిటీ జాబితాను డిపార్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ    ఆమోదించింది. దీంతో త్వరలోనే ఈ 42 మంది అధికారులు ఉన్నత హోదాలలో బాధ్యతలు చేపట్టనున్నారు. 

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ  నిరంతరం సాగుతోంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా..  ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇప్పటివరకు ఏకంగా 10 వేల  మందికి పైగా సిబ్బందికి ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించింది. గత 10 ఏళ్ల   కాలంలో ఇంత భారీ సంఖ్యలో పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు కల్పించడం ఇదే ప్రథమం.  

పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు,  వర్షాకాలం నేపథ్యంలో ప్రజారోగ్యంపై  పవన్ కల్యాణ్   సమీక్ష  నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైన తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా  ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణ తేజలతో పవన్ కల్యాణ్ స్వయంగా మాట్లాడి, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్తపై దిశానిర్దేశం చేశారు. 

ఈ సమీక్షలో పవన్ కల్యాణ్  పారిశుధ్య నిర్వహణపై నిరంతరం ప్రత్యేక దృష్టి సారించాలనీ,  రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలను   అందుబాటులో ఉంచాలని, నీటి కాలుష్యాన్ని నివారించడానికి అవసరమైన చోట తక్షణం వాటిని వినియోగించాలని పవన్ కల్యాణ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్దేశించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...