Latest News
రోల్డ్ గోల్డ్ ధగధగలు... పాపులారిటీ కోసం పడరాని పాట్లు
posted on: Mar 30, 2026 2:15PM

సోషల్ మీడియాలో తెగ పాపులరైన హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సరేష్ అసలు రంగు బయటపడింది. తరచూ ఒంటిపై కిలోల కొద్దీ బంగారు అభరణాలు ధరించి సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిన అతగాడీ అసలు రంగు బయటపడింది. అతడు బంగారం అంటూ ధరిస్తున్న ఆభరణాలు రోల్డ్ గోల్డ్ అని తేలింది. వాటి విలువ మూడు లక్షల రూపాయల లోపేనని స్పష్టమైంది. ఇంతకీ రోల్డ్ గోల్డ్ ధగధగల బాగోతం ఎలా బైటపడిందంటే?..
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేష్ కుమార్ అసలు రంగు బయటపడింది. ఒంటి నిండా కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరించి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ 'గోల్డ్ మ్యాన్' ఐటీ అధికారుల విచారణలో అడ్డంగా దొరికిపోయారు. ఆయన ధరిస్తున్న మూడు కిలోల ఆభరణాలు అసలైన బంగారం కాదని, అవన్నీ కేవలం బంగారు పూత పూసిన రోల్డ్ గోల్డ్ వస్తువులని అధికారులు నిర్ధారించారు.
వివరాల్లోకి వెళ్తే.. సూర్యాభాయ్ తన విలాసవంతమైన జీవనశైలిని సోషల్ మీడియా వేదికగా ప్రదర్శించేవారు. సుమారు 3 కిలోల బరువుండే భారీ గొలుసులు, ఉంగరాలు ధరించి టీవీ సీరియల్స్, సినిమాల్లో కూడా నటిస్తూ, తరచూ యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పుకునే వారు. ఈ క్రమంలోనే ఐటీ అధికారులు ఆయనపై నిఘా ఉంచారు.
ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో శేరిలింగంపల్లికి చెందిన కొండా విజయ్ కుమార్ అనే వ్యక్తి మూడుకిలోల బంగారంతో పట్టుబడ్డారు. అతని వద్ద ఉన్న బంగారానికి సంబంధించి సరైన లెక్కలు లేకపోవడంతో ఐటీ అధికారులు విచారించారు. ఈ క్రమంలో విజయ్ కుమార్ ఫోన్ డేటాను విశ్లేషించగా, సూర్యాభాయ్కి సంబంధించిన ఫోటోలు, సంప్రదింపులు బయటపడ్డాయి. దీంతో అధికారులు సూర్యాభాయ్ని విచారణకు పిలిచి ఆయనను
హైదరాబాద్ ఐటీ కార్యాలయంలో విచారించారు. ఆ సందర్భంగా అతడు ధరించే 32 రకాల ఆభరణాలను అధికారులు నిపుణులతో పరీక్షించారు. దీంతో సూర్యాభాయ్ ఆడంబరంగా ప్రదర్శించే నగలు రోల్డ్ గోల్డ్ అని తేలింది. పాపులారిటీ కోసం పాకులాటలో భాగంగానే ఆయన వాటిని బంగారు ఆభరణాలుగా చెప్పుకుంటూ తిరిగేవారని తేలింది.
ప్రస్తుతం సూర్యాభాయ్ ఆదాయ మార్గాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. కేవలం గుర్తింపు కోసమే ఇలాంటి నకిలీ వేషధారణలతో మోసాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని నిపుణులు అంటున్నారు.


.webp)



