మనుషుల ఉద్యోగాలు లాగేస్తున్న రోబోలు.. ఒకేసారి 1,000 మందిపై వేటు వేసిన జీఎం!

posted on: Jun 22, 2026 1:11PM

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అధునాతన రోబోటిక్ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. అయితే ఈ టెక్నాలజీ విప్లవం ఎందరో కార్మికుల పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా ఆటోమొబైల్ రంగానికి చెందిన అంతర్జాతీయ దిగ్గజ సంస్థ 'జనరల్ మోటార్స్' (GM) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక మార్పుల పేరుతో ఏకంగా 1,000 మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించింది. మానవ శ్రమ స్థానంలో సరికొత్త యంత్రాలను ప్రవేశపెట్టి కార్మిక లోకంలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది.

కంపెనీ తన డెట్రాయిట్ అసెంబ్లీ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఈ 1,000 మంది కార్మికులను తొలగించి, వారి స్థానంలో కేవలం 50 అధునాతన రోబోలను రంగంలోకి దించింది. వీటిని సాధారణ రోబోలు అనడం కంటే 'సహకార రోబోట్లు' లేదా 'కోబోట్లు' (Cobots) అని పిలుస్తారు. వాహనాల బాడీ ప్యానెళ్లను అసెంబ్లీ లైన్‌లో ఖచ్చితత్వంతో అమర్చడానికి ఈ కోబోట్లు మిగిలిన మానవ సిబ్బందితో కలిసి పనిచేయనున్నాయి. మార్కెట్లో ఇతర సంస్థల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీని తట్టుకోవడానికి, కార్యకలాపాల్లో వేగం, కార్మికుల భద్రతను పెంచడానికే ఈ రోబోటిక్ యూనిట్లను తీసుకొచ్చామని కంపెనీ సమర్థించుకుంటోంది.

కానీ, జనరల్ మోటార్స్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంపై కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. యునైటెడ్ ఆటో వర్కర్స్ (UAW) లోకల్ ప్రెసిడెంట్ జేమ్స్ కాటన్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. కేవలం 50 యంత్రాల కోసం 1,000 మంది రక్తం, చెమట చిందించిన కార్మికుల ఉద్యోగాలను లాగేసుకోవడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం ప్లాంట్‌లో మిగిలి ఉన్న ఉద్యోగుల్లో కూడా ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందోననే భయాందోళనలు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో ఈ రోబోల సంఖ్య పెరిగి, మరింత మంది రోడ్డున పడే ప్రమాదం ఉందని కార్మిక నేతలు హెచ్చరిస్తున్నారు.

టెక్నాలజీ పేరుతో ఉద్యోగాల కోత విధించడం కేవలం ఆటోమొబైల్ రంగానికే పరిమితం కాలేదు. ఇప్పటికే ఐటీ రంగంలో కూడా లే-ఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ సైతం ప్రపంచవ్యాప్తంగా 12,000 నుండి 15,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. ఇందులో సుమారు రెండున్నర లక్షల మంది భారతీయులు ఉండటం గమనార్హం. మరోవైపు ఒరాకిల్ సంస్థ కూడా క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఐ డేటా సెంటర్ల కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తూనే, వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తోంది. మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయంగా మారుతున్న ఈ ఆటోమేషన్ యుగంలో, సామాన్య కార్మికుడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...