Latest News
గాయత్రి ప్రజాపతి వికెట్ పడింది! అసలు ఆట ఇప్పుడే మొదలైంది!
posted on: Mar 15, 2017 2:54PM
.jpg)
ఎన్నికల సమయంలో మోదీ ప్రత్యర్థులపై వాగ్బాణాలు ఎక్కుపెడుతుంటారు. ఇక యూపీ ఎన్నికల్లో అయితే ఆయన రామ బాణాలే సంధించారు ఎస్పీ,బీఎస్పీ, కాంగ్రెస్ లపైన. స్కాం అన్న ఒక పదంలో అందర్నీ కట్టిపడేసి ఎద్దేవ చేశారు. అలాగే, ఎన్నికల భీభత్సమైన యుద్ధ వాతావరణంలో వినిపించిన మరో పంచ్ డైలాగ్... మేం గాయత్రి మంత్రం పఠిస్తాం. వాళ్లు గాయత్రి ప్రజాపతి మంత్రం పఠిస్తారు... అన్నది! మోదీ కూడా టార్గెట్ చేసిన సదరు గాయత్రి ప్రజాపతి ఎవరో తెలిసిందేగా...
గాయత్రి ప్రజాపతి ఎస్పీలోని సీనియర్ నేత. అమేథినగరం నుంచీ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అయితే, తాజా ఎన్నికల్లో బీజేపి అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అంతే కాదు, ఎన్నికల సమయంలో నామినేషన్ వేసి మాయమైపోయారు. ప్రచారంంలో ఎక్కడా కనిపించలేదు. ఆయన నియోజక వర్గంలో అఖిలేష్ ప్రచారం చేసినప్పుడు గాయత్రి ప్రజాపతి కనిపించనే లేదు! ఇంతకు ఆయన చేసిన ఘన కార్యం ఏంటి అంటారా? యూపీలోని బోలెడు మంది దుర్మార్గ నేతల్లాగే ఆయన కూడా ఒక రేప్ కేసులో నిందితుడు. తనపై రేప్ కేసు వున్నా దర్జాగా బయటే తిరిగాడు ఇంత కాలం. కాని, తమ ఎస్పీ సర్కార్ పోయి బీజేపి గవర్నమెంట్ రావటంవతో లక్నోలో అరెస్ట్ అయ్యాడు! ఆయనగారు లక్నోలోనే వున్నా ఇంత కాలం యూపీ పోలీసులకి ఆచూకీ దొరకనే లేదు! ఎస్పీ పాలనలో ఆ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మరీ దారుణంగా తయారైంది. లక్నోలో ఐసిస్ ఉగ్రవాది తలదాచుకున్నా ఆ సమాచారం తెలంగాణ, మధ్యప్రదేశ్ పోలీసులకి, ఢిల్లీలోని భద్రాతాధికారులకి తెలిసింది తప్ప యూపీ ఖాకీలకు తెలియలేదు! అదీ వారి దుస్థితి!
అయిదేళ్ల సమాజ్ వాది రౌడీ పాలనలో గాయత్రి ప్రజాపతి లాంటి గూండాల రాజ్యానిక అడ్డు అదుపు లేకుండా పోయింది! ఇప్పుడు పీఠం ఎక్కబోయే బీజేపి సీఎం ప్రధాన కర్తవ్యం ఆ కోరలు చాచిన దాదాల దౌర్జన్యాన్ని పెకిలించటమే! సమూల మార్పు తేలేకున్నా పట్టపగలు హత్యలు, హైవేలపైనే రేప్ లు జరిగే అరాచక స్థితిని చక్కదిద్దాలి. గాయత్రి ప్రజాపతులు మొత్తం ఎంత మంది వున్నారో అందరి లెక్కలూ తీసి తాట కూడా తీయాలి! అది చేస్తేనే యూపీ ప్రజలు వేసిన ఓట్లకు సార్థకత వచ్చేది! బీజేపికి బంగారు భవిష్యత్ కూడా వుండేది!






