Latest News
గుడ్డు డే మీల్ అసలు కథ ఏమిటి?....గరికపాటి వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి?
posted on: Mar 22, 2026 1:01PM

ఇన్ జనరల్గా.. మిడ్ డే మీల్ వరకూ ఓకే. కానీ ఈ గుడ్డు డే మీల్ ఎందుకూ? అవసరమా? ఆ పిల్లాడు బాగా తిని శోభనం పెళ్లికొడుకులా మారి మంచమెక్కి పడుకోడా? అంటూ సాగిన గరికపాటి మాటల్లోని అంతరార్ధం ఏమిటి? అన్న చర్చ ఒకటి మొదలైంది.
పిల్లలు మన భవిష్యత్ తరాలు. భవిష్యత్ బాగుంటే మనమూ బాగుంటాం. వచ్చే రోజుల్లో ఈ జాతి మొత్తం బాగుంటుంది. ఇందులో ఎలాంటి తప్పిదం లేదు. అనుమానం లేదు. వంక అక్కర్లేదు. వారికి గుడ్డు పెట్టడంలో వచ్చిన నష్టమేం లేదు.
మరి గరికపాటి ఎందుకలా ఎగ్ మీల్స్ ని తీవ్రంగా తప్పు పడుతున్నారు? అన్నదొక పాయింట్. చదువు మీద దృష్టిసారించకుండా.. ఈ గుడ్డూలో గోల ఎక్కువ అవుతుందనే ఆయన అంటోన్న మాటల సారం. గత వైసీపీ ప్రభుత్వంలో టీచర్లకు వైన్ షాపు ముందు డ్యూటీలు వేశారు. టీచర్లు.. టీచర్ బ్రాండ్ బ్రాండీ విస్కీల సప్లై దగ్గర వేయడం ఏంటని అప్పట్లో పెద్ద చర్చ.
ఇప్పుడు గరికపాటి వెలుగులోకి తెచ్చిన టీచర్ల- గుడ్ల లెక్కింపు వ్యవహారం కూడా సరిగ్గా అలాంటిదేనంటారు కొందరు. వారు పాఠాలు చెప్పాలా? లేక ఈ గుడ్లను లెక్కించాలా? అన్న టాపిక్ ఆయన రైజ్ చేసిన పాయింట్లలో ముఖ్యమైనది. ఆల్ ఇన్ ద గేమ్ అన్నట్టు.. టీచర్లు తమ డ్యూటీ అయ్యాక(కొందరు ఆ డ్యూటీ కూడా చేయరనుకోండి) బయట ఇంకా ఎన్నో చేస్తుంటారు. చాలా మంది టీచర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఆపై ఎల్ఐసీ, చిట్టీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే. వీటిలో ట్యూషన్లది అతి పెద్ద వ్యవహారం. ఇక ఇక్కడ సెలవులు పెట్టి- అక్కడ కార్పొరేట్ కాలేజీల్లో వారు చెప్పే కాస్ట్ లీ క్లాసుల సంగతి సరే సరి.
అలాంటి టీచర్లు.. గుడ్లు లెక్క పెట్టగా వచ్చే నష్టమేం లేదు. వాళ్లకు లేని నొప్పి మనకేంటి? దానికి తోడు టీచర్లు కూడా ఒకే సబ్జెక్ట్ కే పరిమితం అవుతుంటారు. ఒక స్టూడెంట్ తో పోలిస్తే అది ఎంతో ఈజీ జాబ్. సింగిల్ సబ్జెక్ట్ కి గుడ్డులాంటి ఇంకో సబ్జెక్ట్ యాడ్ కావడం ఏమంత కష్టమైన వ్యవహారం ఏమీ కాదు.
ఇక మధ్యాహ్న భోజన పథకం.. ఎప్పటి నుంచి ప్రవేశ పెట్టారు? ఎవరు ఎక్కడ ప్రవేశ పెట్టారని చరిత్ర తిరగేస్తే.. ఈ ఘనత భారత దేశానికే దక్కుతుంది. ఇది ఎప్పుడు ఎలా మొదలైందో పరిశీలిస్తే.. 1925లో మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒక పాఠశాలలో పేద విద్యార్ధులకు తేలిక పాటి భోజనం అంటే టిఫిన్ అందించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. స్కూళ్లలో ఆకలిని తగ్గించడం, పిల్లల హాజరీని పెంచడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
తర్వాతి కాలంలో.. నాటి తమిళ ముఖ్యమంత్రి కామరాజ్.. 1950ల మధ్య కాలంలో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే యత్నం చేశారు. ఇందు వల్ల స్కూలు విద్యార్ధుల నమోదు గణనీయంగా పెరిగింది.1995, ఆగస్టు 15న భారత ప్రభుత్వం.. జాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రాం ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ పేరిట ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ప్రారంభంలో ఇది కేవలం కొందరు విద్యార్ధులకు ముడి రేషన్ సరుకులు మాత్రమే ఇచ్చేదిగా ఉండేది. కానీ, 2001లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తమిళనాడు తరహాలో.. వేడిగా వండిన భోజనం అందించే పథకంగా రూపాంతరం చెందింది.
ప్రస్తుతం ఈ పథకం పేరు- ప్రధాన మంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ గా పిలుస్తున్నారు. తరగతి గదిలో ఆకలి ద్వారా చదువుపై దృష్టి సారించడం వీలు కాదు. కాబట్టి పిల్లలకు కడుపు నిండా ఆహారం అవసరం అనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దానికి తోడు పేద కుటుంబాల్లోని పిల్లలు పనికి వెళ్లకుండా స్కూలుకు వచ్చే దిశగా ప్రోత్సహించడమే దీని మెయిన్ టార్గెట్. ఇక గుడ్డు కూడా కలిపి పెట్టడం వల్ల ఎదిగే పిల్లలకు అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు అందించడం కూడా ఒక భాగమే.
దానికి తోడు ఈ జనరేషన్ గతంలోలా నాటు ఆహారం తిని బలిష్టంగా ఎదుగుతున్న వారు కాదు. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్.. ఇంటి గది నుంచి తరగతి గదికి వెళ్తున్న వారే అధికం. ఫారం కోళ్లలా బతుకులీడుస్తున్న దుస్థితి రాజ్యమేలుతోంది. కొన్ని స్కూళ్లలో కనీసం మైదానం కూడా ఉండదు. దానికి తోడు ఇప్పుడంతా.. జంక్ ఫుడ్ జనరేషన్. వీరు అధిక శాతం ప్యాకెట్ ఫుడ్ తింటూ బతుకుతున్నారు. అలాంటి వారికి గుడ్డు పెట్టడం వల్ల లాభమే కానీ నష్టం లేదు. ఇదేదీ గమనించని గరికపాటి.. ఆయన ఇష్టాను సారం మాట్లాడ్డం తగదని అంటున్నారంతా.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తిని చదువుకునే పేద విద్యార్థులను శోభనం పెళ్లి కొడుకులతో పోలుస్తూ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పలు ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. గరికపాటి తక్షణం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.


.webp)



