రూ.2 కోట్ల విలువైన హ్యాష్ ఆయిల్‌ తరలిస్తున్న ముఠా అరెస్ట్

posted on: Apr 21, 2026 3:01PM

 

వరంగల్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు గట్టి దెబ్బ కొట్టారు. రెండు కోట్లకు పైగా విలువ చేసే హాష్ ఆయిల్‌ను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. ఇటీవల స్మగ్లర్లు మాదకద్రవ్యాలను తరలించేందుకు బస్సులు, రైళ్లను ప్రధానంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో పోలీసులు రైల్వే స్టేషన్ల వద్ద తనిఖీలు కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరిని పోలీసులు గమనించారు. ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్ కంట్రోల్ టీమ్‌తో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు.

తనిఖీల సమయంలో వారి బ్యాగుల్లో భారీగా హాష్ ఆయిల్ ఉండటాన్ని గుర్తించిన పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే చర్యలు తీసుకున్న అధికారులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి మొత్తం 40 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ మాదకద్రవ్యాల విలువ సుమారు రూ.2.5 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ హాష్ ఆయిల్‌ను చిన్న ప్యాకెట్లుగా విభజించి ముంబైలో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిసింది. ఒడిశాకు చెందిన హంటల్ సన్ను (23), హంటల్ సన్యాసి (23), కండెల చిన్నబాబు (56), కృష్ణా హంటల్ (56)లను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

నిందితులు గంజాయి మొక్కల నుంచి హాష్ ఆయిల్ తయారు చేసి, తక్కువ పరిమాణంలో ఎక్కువ లాభాలు పొందేందుకు ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి విక్రయాలతో పోలిస్తే హాష్ ఆయిల్ స్మగ్లింగ్ ఎక్కువ లాభదాయకంగా మారడంతో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఈ సంఘటనతో అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్‌వర్క్‌పై పోలీసులు మరింత నిఘా పెంచారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరంగల్‌లో జరిగిన ఈ ఆపరేషన్ డ్రగ్స్ ముఠాలకు గట్టి హెచ్చరికగా నిలిచింది.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...