మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

posted on: May 29, 2026 5:53PM

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు తనదైన ముద్ర వేసి, ఐదు దశాబ్దాల పాటు క్రియాశీల పాత్ర పోషించిన సీనియర్ మోస్ట్ నాయకుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి (85) ఇకలేరు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం (మే 29న) హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించడంతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఒక నిబద్ధత కలిగిన సీనియర్ నాయకుని తాము కోల్పోయామని ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యాయవాది వృత్తి నుంచి మంత్రి పదవి వరకు సాగిన గాదె వెంకటరెడ్డి రాజకీయ ప్రస్థానం యువతకు ఒక గొప్ప పాఠం లాంటిది. ఆయన 1940 జూలై 10న ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో జన్మించారు. ఎల్‌ఎల్‌బీ (LLB) పూర్తి చేసి చట్టాలపై మంచి పట్టు సాధించిన ఆయన, సమాజ సేవ మరియు ప్రజా రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన గాదె వెంకటరెడ్డి, చాలా చిన్న వయస్సులోనే సంచలన విజయాన్ని నమోదు చేశారు. 1967 అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి కేవలం 27 సంవత్సరాల వయస్సులోనే పోటీ చేసి, మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు.

అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా సాగవు కదా.. ఆయన జీవితంలో కూడా ఊహించని ఎదురుదెబ్బలు, ఓటములు ఎదురయ్యాయి. 1967లో ఘన విజయం సాధించిన తర్వాత.. 1972, 1978, 1983, 1985, 1989 ఎన్నికల్లో ఆయన వరుసగా ఐదు సార్లు ఓటములను చవిచూడాల్సి వచ్చింది. సాధారణంగా ఎవరైనా వరుసగా రెండు మూడు సార్లు ఓడిపోతేనే రాజకీయాల నుంచి తప్పుకుంటారు లేదా నైరాశ్యంలో మునిగిపోతారు. కానీ గాదె వెంకటరెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రజల్లోనే ఉంటూ నిరంతరం వారి సమస్యలపై పోరాడారు. ఈ సుదీర్ఘ నిరీక్షణకు 1991 ఉప ఎన్నికల రూపంలో పెద్ద విజయం దక్కింది. ఆ తర్వాత 1994 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఆయనకున్న న్యాయ పరిజ్ఞానం, పరిపాలన దక్షతను గుర్తించిన నాటి ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి తమ కేబినెట్‌లోకి తీసుకున్నారు. 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో ఎక్సైజ్ మరియు నిషేధ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత నియోజకవర్గాల మార్పుల్లో భాగంగా ఆయన బాపట్ల నియోజకవర్గానికి మారారు. 

అక్కడ 2004 మరియు 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR) మరియు కొణిజేటి రోశయ్య మంత్రివర్గాల్లో అత్యంత కీలకమైన దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసి తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. ఆలయాల భూముల పరిరక్షణ, అర్చకుల సమస్యల పరిష్కారంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ గుర్తిండిపోతాయి.

2014లో రాష్ట్ర విభజన అనంతరం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన ప్రత్యక్ష ఎన్నికల పోటీకి దూరంగా ఉన్నారు. దశాబ్దాల పాటు హస్తం పార్టీకి నమ్మకమైన సైనికుడిగా పనిచేసిన ఆయన, 2016 ఏప్రిల్ 29న కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ (TDP)లో చేరారు. అక్కడ నాలుగేళ్ల పాటు కొనసాగిన అనంతరం, 2020 మార్చి 16న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తీర్థం పుచ్చుకున్నారు. 

ఆయన మృతి  పట్ల  ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఐదుసార్లు ప్రాతినిథ్యం వహించిన వెంకట్ రెడ్డి, మంత్రిగా వివిధ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తుచేసుకున్నారు.సౌమ్యుడు, సహనశీలిగా పేరుగాంచిన వెంకట్ రెడ్డి  ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. వారు లేని లోటు తీర్చలేనిదని పేర్కొంటూ, గాదె వెంకట్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...