గద్దర్‌ మద్దతు కోరిన టీ-టీడీపీ

posted on: Jul 17, 2011 11:22AM

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజాఫ్రంట్‌ అధ్యక్షుడు, ప్రజాగాయకుడు గద్దర్‌ను టీ-టీడీపీ నేతలు ఆదివారం కలిశారు. తాము నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని వారు కోరారు. తమతో కలిసొచ్చే అన్ని పార్టీలతో కలిసి ఉద్యమించాలని టీ-టీడీపీ నేతలు నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమ పోరులో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లను ఎదుర్కొనేందుకు ఎత్తుగడల వ్యూహంతో టీడీపీ నేతలు సాగుతున్నారు.

కొత్త జేఏసీని ఏర్పాటు చేసేందుకు తాము గద్దర్‌ను కలువలేదని, తెలంగాణ కోసం అందరినీ ఏకతాటిపైకి తేవాలని మాత్రమే తాము గద్దర్‌ను కోరామని, ఈ దిశలో ఆయన చొరవ చూపాలని టీ-టీడీపీ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ కోసం జెండాలు, అజెండాలు పక్కన బెట్టి ముందుకు వస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మంచి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణవారిది కడుపు కాలే పోరాటమని, సీమాంధ్రులది కడుపు కాలిన పోరాటమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారన్నారు. అక్కడ ఎవరూ ప్రాణ త్యాగం చేయలేదని ఆయన పేర్కొన్నారు.  కాగా, రాజకీయాల్లో తటస్థం పనికి రాదని, తెలంగాణకు మద్దతు ఇవ్వాలని కోరుతూ త్వరలోనే చంద్రబాబును కలుస్తామని గద్దర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఐక్యత అవసరమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సాధన వనరుల సంరక్షణకు జాయింట్‌ ఫోరం ఏర్పాటుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...