డేటా సెంటర్ల భవిష్యత్ కు ఢోకా లేదు.. అమెరికాతో పోలిక సరికాదు!

posted on: Jun 2, 2026 1:05PM

భారతదేశం సరికొత్త డిజిటల్ విప్లవానికి నాంది పలుకుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ తరుణంలో, భారీ డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడం అత్యంత అవసరంగా మారింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా హైపర్‌స్కేల్ డేటా సెంటర్ల ఏర్పాటు శరవేగంగా సాగుతోంది. అయితే.. ఇటువంటి భారీ ప్రాజెక్టుల వల్ల విద్యుత్, నీరు వంటి సహజ వనరులు పూర్తిగా హరించిపోతాయంటూ కొందరు మే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విమర్శలు చాలావరకు పాశ్చాత్య మీడియా, ముఖ్యంగా అమెరికా అనుభవాలను చూసి పుట్టుకొచ్చినవే. అమెరికాలో డేటా సెంటర్ల వల్ల అక్కడి పవర్ గ్రిడ్‌లు కుప్పకూలుతున్నాయనే వార్తలను ఆధారం చేసుకుని, భారత్‌లో కూడా అదే జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో..  ఆంధ్రప్రదేశ్ ఐటీ,  పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ అపోహలను పూర్తిగా కొట్టిపారేశారు. అమెరికా పరిస్థితులకు, భారతీయ వాస్తవాలకు అస్సలు పోలికే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అమెరికా డిజిటల్ మార్కెట్‌ను చూసిఇండియాను అంచనా వేయడం ముమ్మాటికీ తప్పుడు అవగాహనే అని లోకేష్ తేల్చారు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలను నారా లోకేష్ గణాంకాలతో సహా వివరించారు.  "వన్ నేషన్, వన్ గ్రిడ్"  ఇండియాకు ఉన్న  అతిపెద్ద వ్యూహాత్మక ఆయుధమని విశ్లేషించారు. 

ఇండియా  మొత్తం ఒకే రకమైన, ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన జాతీయ పవర్ గ్రిడ్ వ్యవస్థ ద్వారా నడుస్తోంది. కానీ.. అందుకు భిన్నంగా  అమెరికాలో ఏకీకృత జాతీయ పవర్ గ్రిడ్ లేదు. అక్కడ విద్యుత్ వ్యవస్థ అంతా ముక్కలుగా, మూడు ప్రధాన స్వతంత్ర బ్యాలెన్సింగ్ అథారిటీలుగా,   వేల సంఖ్యలో   స్థానిక ప్రైవేట్ యుటిలిటీ సంస్థలుగా విచ్ఛిన్నమై ఉంది. దీనివల్ల అమెరికాలోని ఏదైనా ఒక నిర్దిష్ట రాష్ట్రంలో లేదా కౌంటీలో భారీ డేటా సెంటర్ల క్లస్టర్ ఏర్పడినప్పుడు, ఆ ప్రాంతంలోని స్థానిక విద్యుత్ సరఫరాదారుపై  తట్టుకోలేనంత  భారం పడుతుంది. అక్కడ స్థానికంగా విద్యుత్ కొరత ఏర్పడితే.. వేల మైళ్ల దూరంలో ఉన్న ఇతర ప్రాంతాల నుండి అదనపు విద్యుత్‌ను సులభంగా రప్పించుకునే సాంకేతిక వీలు అమెరికాకు లేదు. ఫలితంగా అక్కడ పవర్ బ్లాకౌట్‌లు రావడం..  కరెంట్ బిల్లులు విపరీతంగా పెరిగిపోవడం సర్వసాధారణంగా మారింది.

అయితే ఇండియాకు  ఆ ముప్పు లేదు. ఇక్కడ జాతీయంగా అనుసంధానించబడిన సింక్రనైజ్డ్ గ్రిడ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే ఒక పెద్ద డేటా సెంటర్ హబ్‌కు భారీగా విద్యుత్ అవసరమైతే..  ఆ విద్యుత్ ను కేవలం స్థానిక ప్రాంతీయ ప్లాంట్ల నుంచే సేకరించాల్సిన అవసరం లేదు. జాతీయ గ్రిడ్ ద్వారా దేశంలోని ఏ మూల నుంచైనా మిగులు విద్యుత్‌ను విశాఖపట్నం డేటా సెంటర్‌కు క్షణాల్లో మళ్లించవచ్చు. ఈ అద్భుతమైన మౌలిక సదుపాయాల వల్లే భారతదేశం ఏ ప్రాంతంపైనా ఒత్తిడి పడకుండా ఎంతటి భారీ డిజిటల్ కేంద్రాలనైనా సురక్షితంగా నిర్వహించగలదు.

ఇక వనరుల వినియోగం గురించి వస్తున్న విమర్శలు కూడా   ఊహాజనితమైనవేనని మంత్రి నారా లోకేష్ అన్నారు.  డేటా సెంటర్ల కూలింగ్ కోసం వాడే నీటి పరిమాణంపై కొందరు చేస్తున్న హడావుడిని ఆయన గణాంకాలతో తిప్పికొట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏకంగా 6.5 గిగావాట్ల  సామర్థ్యం గల భారీ డేటా సెంటర్ ఎకోసిస్టమ్‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ ప్రాజెక్టు మొత్తానికి కలిపి అవసరమయ్యే నీరు కేవలం 1 టీఎంసీ   మాత్రమే. దీనిని మన సహజ వనరులతో పోల్చి చూస్తే అది అత్యంత స్వల్పం. ప్రతి ఏటా  గోదావరి  గుండా దాదాపు 3,000 టీఎంసీల  వర్షపు నీరు ఎలాంటి ఉపయోగం లేకుండా సముద్రంలో   కలిసిపోతోంది. సముద్రం పాలు అవుతున్న ఆ వేల టీఎంసీల నీటితో పోలిస్తే..  డిజిటల్ విప్లవానికి ఐటీ హబ్‌ల కోసం వాడే ఈ ఒక టీఎంసీ నీరు చాలా చిన్న భాగమన్నారు లోకేష్. 

అరకొర సమాచారంతో, పాశ్చాత్య దేశాల తప్పుడు ఉదాహరణలను చూపిస్తూ భారతదేశ ఆర్థిక వృద్ధిని, పారిశ్రామిక పురోగతిని అడ్డుకోవడం సరికాదని   హితవు పలికారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఏఐ విప్లవాన్ని అందిపుచ్చుకోవడానికి, గ్లోబల్ టెక్ హబ్‌గా ఎదగడానికి భారతదేశానికి అన్ని రకాల అర్హతలు,  నిర్మాణ సామర్థ్యాలు ఉన్నాయన్న లోకేష్. ఇండియాకు ఉన్న  ఏకీకృత జాతీయ పవర్ గ్రిడ్ వ్యవస్థే ఈ సాంకేతిక ప్రయాణంలో   అతిపెద్ద రక్షణ కవచం,  రహస్య ఆయుధంగా  మారింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...