ఇండియా నరకకూపం అన్న వారాల వ్యవధిలోనే.. మాట మార్చిన ట్రంప్

posted on: May 25, 2026 4:19PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి నుండి  ఏ నిముషానికి ఏ మాట వస్తుందో ఎవరూ ఊహించలేరు.  కేవలం కొన్ని వారాల కిందట  అమెరికాను దోపిడీ చేయడానికి ఇండియా తన పౌరులను ఎగుమతి చేస్తున్నదన్న డోనాల్డ్ ట్రంప్.. ఇండియాను ఒక నరకకూపంగా అభివర్ణించారు. అదే నోటితో తాజాగా ఆయన ఇండియా అమెరికాకు గొప్ప మిత్రదేశమని, తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక బిగ్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు.  అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత పర్యటన సందర్భంగా..  ప్రత్యక్ష ప్రసారంలో వర్చువల్‌గా కనిపించిన డొనాల్డ్ ట్రంప్, తాను ఇండియాను  ప్రేమిస్తున్నాన్నారు. అందరికీ   అందరికీ హలో చెప్పాలనుకుంటున్నాననీ, తాను ప్రధాని మోడీకి బిగ్ ఫ్యాన్ ననీ చెబుతూ.. ప్రధాని మోడీని ఒక గొప్ప వ్యక్తిగా, తనకు అత్యంత సన్నిహితమైన ఫ్రెండ్ గా పేర్కొన్నారు.  గతంలో ఎన్నడూ అమెరికా ఇండియాకు ఇంత సన్నిహితంగా లేదన్న ట్రంప్.. ఇండియా అమెరికాపై వంద శాతం ఆధారపడవచ్చనీ,   వారికి ఏదైనా సహాయం అవసరమైతే,  ఒక్క ఫోన్ కాల్ చాలు చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు.  ఇండియా  అమెరికాకు   మిత్రదేశమనీ, కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం భరోసా ఇచ్చే ప్రకటన కావచ్చునేమో కానీ, పాలనా చర్యల విషయానికి వస్తే, అమెరికా భారత జనాభాకు వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకుంటోంది. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అమెరికాలోని భారత జనాభా భారతదేశానికి తిరిగి వెళ్లాలని ఆదేశించే ఇటీవలి ఉత్తర్వులే ఇందుకు నిదర్శనం.     
వాస్తవానికి, అంతర్జాతీయ దౌత్య వేదికలపై ట్రంప్ భారతదేశంతో  హాట్ అండ్ కోల్డ్ సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. ఒకవైపు భారత వస్తువులపై భారీగా పన్నులు   విధిస్తూ, కఠినమైన వాణిజ్య నిబంధనలను అమలు చేస్తూనే.. మరోవైపు ప్రధాని మోదీని పబ్లిక్ వేదికలపై ఆకాశానికెత్తేయడం ట్రంప్‌కు అలవాటుగా మారింది. గతంలోనూ రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. దీనివల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నాయి. అయినప్పటికీ, వాణిజ్య ఒప్పందాల విషయంలో మోదీతో కలిసి పని చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధమేనని ట్రంప్  సంకేతాలు ఇస్తూనే ఉన్నారు.

ఒకవైపు అధ్యక్షుడు ట్రంప్ దేశాధినేతల స్థాయిలో భారత్‌తో మైత్రి గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అమెరికా యంత్రాంగం తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం భారతీయ పౌరులకు  ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల అమెరికా ప్రభుత్వం జారీ చేసిన నూతన వలస నిబంధనల ఉత్తర్వులు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే, వారు తిరిగి తమ స్వదేశానికి  వెళ్లి అక్కడి నుంచే ఫైల్ చేయాలని నూతన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం వల్ల అమెరికాలో స్థిరపడాలనుకునే వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

రాజకీయంగా, దౌత్యపరంగా ట్రంప్ ప్రకటనలు భారత్‌కు సానుకూలంగా కనిపిస్తున్నప్పటికీ..  అమెరికా అంతర్గత విధానాలు మరియు వాణిజ్య ఆంక్షలు మాత్రం భారతదేశ ప్రయోజనాలకు భిన్నంగా సాగుతున్నాయన్నది నిపుణుల విశ్లేషణ. ట్రంప్ మాటల్లోని సాన్నిహిత్యం చేతల్లో కూడా కనిపిస్తేనే ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని అంటున్నారు.  ఏది ఏమైనప్పటికీ, అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా వంటి అగ్రరాజ్యం భారత్‌కు వంద శాతం అండగా ఉంటామని, ఒక్క ఫోన్ కాల్‌తో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం అంతర్జాతీయంగా భారతదేశ వ్యూహాత్మక బలాన్ని చెప్పకనే చెబుతోంది. 

రాబోయే రోజుల్లో ట్రంప్ చేసిన ఈ సానుకూల వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య వివాదాలను పరిష్కరించడానికి,  వీసా నిబంధనలను సరళీకరించడానికి ఎంతవరకు దోహదపడతాయన్నది చూడాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడి తాజా యూ-టర్న్ ప్రకటనతో భారత్-అమెరికా రక్షణ, ఆర్థిక భాగస్వామ్యం సరికొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...