ఉలవచారు నుంచి ఉలవచారు రత్నం వరకూ.. రైతు విజయగాధ

posted on: Jun 2, 2026 4:06PM

వేడివేడి అన్నంలో కాస్తంత వెన్న లేదా మీగడ వేసుకుని, ఘుమఘుమలాడే ఉలవచారుతో కలిపి తింటే ఆ రుచే వేరు. తెలుగువారి వంటింట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ సాంప్రదాయ వంటకం వెనుక ఒక అసాధారణ విజయగాధ దాగి ఉంది. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబానికి ఎదురైన వరుస ఆర్థిక నష్టాలు, సమాజం నుంచి ఎదురైన అవహేళనలు, వాటన్నింటినీ తట్టుకుని నిలబడిన ఒక వ్యక్తి ఆత్మాభిమాన పోరాటమే నేటి ఇందిరా ఫుడ్స్  సంస్థ. ఇంట్లో తయారు చేయడం ఎంతో శ్రమతో కూడుకున్న పనిగా భావించే ఉలవచారును..  ప్యాకేజ్డ్ రూపంలోకి తెచ్చి అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేసిన ఘనత మండవ వెంకటరత్నానికే దక్కుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆయన ప్రయాణం సరికొత్త చరిత్రను లిఖించింది.  

వ్యవసాయంలో ఒడిదుడుకులు.. కుప్పకూలిన కలలు.. 

కృష్ణా జిల్లా వెంట్రప్రగడ గ్రామానికి చెందిన ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన వెంకటరత్నంకు చిన్నతనం నుంచే వ్యవసాయంపై ఎంతో ఆసక్తి ఉండేది. ఆధునిక పద్ధతులలో పెద్ద ఎత్తున సాగు చేయాలనే లక్ష్యంతో వారి కుటుంబం బోధన్ ప్రాంతంలో నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటి ఆధారం చూసుకుని సాగు ప్రారంభించింది. అయితే ప్రకృతి వైపరీత్యాలు, అనావృష్టి, అతివృష్టి కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ కాలంలోనే సుమారు రెండు లక్షల రూపాయల భారీ నష్టం వాటిల్లడంతో కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆ తర్వాత గుల్బర్గా, ఎర్రగొండపాలెం వంటి ప్రాంతాల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ వాతావరణం, మార్కెట్ ధరలు కలిసి రాకపోవడంతో వ్యవసాయం ద్వారా స్థిరపడాలనే వారి ఆశలు అడుగంటాయి. చివరకు అప్పులు తీర్చడం కోసం సొంత ఊరిలోని భూమిని విక్రయించాల్సి వచ్చింది, ఆర్థిక ఇబ్బందుల వల్ల తమ్ముడి చదువు కూడా మధ్యలోనే ఆగిపోయింది.  

సామాజిక ఒత్తిడి, అవహేళనలు

వ్యవసాయ రంగంలో వరుస పరాజయాలు ఎదురైనప్పుడు సమాజం చూసే దృక్పథం వెంకటరత్నంను తీవ్రంగా గాయపరిచింది. ఇన్ని ఊళ్లు తిరిగి ఏం సాధించావు?  అంటూ చుట్టుపక్కల వారి నుంచి వచ్చిన చులకన మాటలు, హేళనలు వారి కుటుంబాన్ని సామాజికంగా ఒంటరిని చేశాయి. ఒక రైతు పడిన కష్టాన్ని లేదా నష్టాన్ని వ్యవస్థా  లోపంగా చూడకుండా, వ్యక్తిగత వైఫల్యంగా ముద్ర వేసే సామాజిక పోకడలను ఆయన ఎదుర్కొన్నారు. ఆ సమయంలో డబ్బు సంపాదించడం కంటే కూడా..  పోగొట్టుకున్న ఆత్మవిశ్వాసాన్ని,  ఆత్మాభిమానాన్ని తిరిగి నిలబెట్టుకోవడమే ఆయన ముందున్న అతిపెద్ద లక్ష్యంగా మారింది.  అదే ఉలవచారు వ్యాపార ఆలోచనకు పునాది అయ్యింది. 

ఈ సంక్షోభ సమయంలో విశాఖపట్నంలోని తన అత్తగారి ఇంట్లో రుచి చూసిన ఉలవచారు వెంకటరత్నం జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో సర్వసాధారణంగా చేసుకునే ఈ వంటకానికి నగరాల్లో మంచి డిమాండ్ ఉందని, ప్రజలు దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని ఆయన గమనించారు. ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ, సుదీర్ఘ సమయం పడుతుందనే కారణంతో ఇంట్లో వండుకోవడానికి వెనుకాడుతున్న వంటకాన్ని వ్యాపారంగా మార్చాలని ఆయన నిర్ణయించుకున్నారు. 1996లో వైజాగ్‌లోని మధురవాడ ప్రాంతంలో సుమారు 40 వేల రూపాయల స్వల్ప పెట్టుబడితో, సాంప్రదాయ కట్టెల పొయ్యి మీద చిన్న స్థాయిలో ఉలవచారు తయారీని ప్రారంభించారు. ప్రారంభంలో లాభాల కంటే కూడా మార్కెట్‌లో స్థిరపడటమే ధ్యేయంగా వ్యాపారం సాగింది.  

హైదరాబాద్ మార్కెట్ విస్తరణ.. ఒక వ్యూహాత్మక నిర్ణయం

 వైజాగ్‌లో వ్యాపారం సాగుతున్నప్పటికీ, ఒక శ్రేయోభిలాషి ఇచ్చిన సలహా వెంకటరత్నం ఆలోచనను మార్చింది. అన్ని ప్రాంతాల ప్రజలు నివసించే హైదరాబాద్ నగరంలో దీనికి మరింత పెద్ద మార్కెట్ ఉంటుందని గుర్తించి, ఆయన తన కేంద్రాన్ని హైదరాబాద్‌లోని నిజాంపేట్ రోడ్డుకు మార్చారు. స్థానిక జనాభా అవసరాలను సరిగ్గా అంచనా వేస్తూ మొదట చిన్న కిరాణా దుకాణాలు, ఆపై సూపర్ మార్కెట్లు, ఆ తర్వాత పెద్ద ఎత్తున జరిగే శుభకార్యాల క్యాటరింగ్ ఆర్డర్లను దక్కించుకోవడం ప్రారంభించారు. ఈ రకంగా ఒక సాదాసీదా గ్రామీణ వంటకం కాస్తా, నగరాల్లోని విందు భోజనాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన ప్రత్యేక ఐటెంగా మారిపోయింది.  

సాంకేతిక ఆవిష్కరణ, పేటెంట్ గుర్తింపు

ఉలవచారును పెద్ద ఎత్తున తయారు చేయడంలో ప్రధాన అడ్డంకి దాని సుదీర్ఘ తయారీ ప్రక్రియ. కనీసం 10 నుండి 12 గంటల పాటు నిరంతరంగా ఉడికించాల్సి రావడం, కట్టెల పొయ్యి వల్ల వచ్చే పొగ, వేడి తట్టుకోవడం కార్మికులకు పెద్ద సవాలుగా మారింది. దీనికోసం డీజిల్, గ్యాస్ బర్నర్లతో ప్రయోగాలు చేసినప్పటికీ ఆశించిన నాణ్యత, రుచి లభించలేదు. పరిశ్రమల్లో వాడే సాధారణ బాయిలర్ల వల్ల అడుగు అంటుకుపోయే సమస్య ఎదురై, దాదాపు 35 లక్షల రూపాయల పెట్టుబడి నష్టపోయే పరిస్థితి వచ్చింది.  ఇటువంటి క్లిష్ట సమయంలో వెంకటరత్నం స్వయంగా ఒక సరికొత్త సాంకేతిక పరిష్కారాన్ని ఆలోచించారు. నేరుగా మంట తగలకుండా, బాయిలర్ నుంచి వచ్చే  విరి (స్టీమ్) సహాయంతో మాత్రమే ఉడికేలా ప్రత్యేకమైన పొడవాటి, వెడల్పాటి పాత్రలను డిజైన్ చేశారు. ఈ  జాకెటెడ్ బాయిలర్ వెసెల్  విధానం ద్వారా ఉలవచారు అడుగు అంటకుండా, అసలైన రుచి,  నాణ్యత చెడకుండా భారీ పరిమాణంలో ఉత్పత్తి చేయడానికి వీలు కలిగింది.  పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న గ్రామీణ రైతు, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా చేసిన ఈ ఇండస్ట్రియల్ డిజైన్‌కు అధికారికంగా పేటెంట్ హక్కులు కూడా లభించడం విశేషం.  

ఇందిరా ఫుడ్స్  బ్రాండింగ్, అంతర్జాతీయ ప్రస్థానం

మార్కెట్‌లో ఆదరణ పెరిగే కొద్దీ నకిలీల సమస్య మొదలైంది. వెంకటరత్నం దగ్గర పనిచేసి వెళ్లిన కొందరు సొంతంగా ఉలవచారు తయారు చేస్తూ మార్కెట్‌లో గందరగోళం సృష్టించారు. దీనిని అరికట్టడానికి ఆయన తన భార్య పేరిట  ఇందిరా ఫుడ్స్   అనే బ్రాండ్‌ను అధికారికంగా రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత వ్యాపార వికేంద్రీకరణలో భాగంగా ఉత్పత్తి కేంద్రాన్ని విజయవాడలోని గుణడలకు మార్చారు. ఈ సంస్థ అద్భుతమైన వృద్ధిని సాధించింది

విస్తృత నెట్‌వర్క్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పంపిణీ వ్యవస్థ ఏర్పాటయింది.    డీ-మార్ట్, రిలయన్స్ ఫ్రెష్ వంటి ప్రముఖ సూపర్ మార్కెట్లతో పాటు వేలాది కిరాణా దుకాణాల్లో ఈ ప్రొడక్ట్ అందుబాటులో ఉంది. అంతే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే,  గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన తెలుగు వారి కోసం అక్కడి గ్రోసరీ స్టోర్లకు భారీగా ఎగుమతి అవుతోంది.  ఇక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా నేరుగా వినియోగదారుల చెంతకు చేరుతోంది.  ఒకప్పుడు కేవలం రోజుకు 4 కిలోల ఉలవలతో ప్రారంభమైన ఈ ప్రయాణం,ఇప్పుడు  ప్రతిరోజూ నాలుగువేల కిలోల ఉలవలను ప్రాసెస్ చేసే స్థాయికి చేరిందంటే.. ఈ బ్రాండ్ సాధించిన విజయం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.   ఈ సుదీర్ఘ ప్రయాణంలో వెంకటరత్నం కుటుంబం ఒక పటిష్టమైన బృందంగా వెన్నుదన్నుగా నిలిచింది. అరవై ఏళ్లు పైబడినప్పటికీ ఆయన తండ్రి వెంకట్రామయ్య పొయ్యి దగ్గర గంటల తరబడి శ్రమించగా, తల్లి విజయలక్ష్మి, సోదరి సరోజిని తయారీకి కావాల్సిన సరుకుల శుభ్రతను చూసుకునేవారు. తమ్ముడు చంద్రశేఖర్ ఆజాద్ మార్కెటింగ్ రంగాన్ని విస్తరించగా, భార్య ఇందిర వ్యాపార ఆలోచనల్లో, బ్రాండింగ్‌లో కీలక పాత్ర పోషించారు. ఒక విజయవంతమైన ఫ్యామిలీ ఎంటర్‌ప్రైజ్ మోడల్‌కు వీరి ప్రయాణం చక్కటి ఉదాహరణ.  

గ్రామీణ యువతకు సరికొత్త పాఠాలు

మండవ వెంకటరత్నం జీవితం కేవలం ఒక విజయగాథ మాత్రమే కాదు, ప్రస్తుత వ్యవసాయ సంక్షోభంలో ఉన్న ఎందరో రైతులకు,  గ్రామీణ యువతకు ఒక దిక్సూచి. సాంప్రదాయ నైపుణ్యాలకు ఆధునిక సాంకేతికతను జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన నిరూపించారు. కేవలం పంటలు పండించడమే కాకుండా, వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా  మార్చి, సరైన బ్రాండింగ్ మరియు ప్యాకేజింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లగలిగితే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చనే బలమైన సందేశాన్ని ఈ కథ అందిస్తోంది. 

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.     


 

google-ad-img
    Related Sigment News
    • Loading...