జనసంఘం నుంచి భారతీయ జనతా పార్టీ వరకు.. బీజీపీలో బెంగాల్‌ మూలాలు

posted on: May 3, 2026 10:43AM

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇప్పుడు ఉత్తర నుండి దక్షిణం, తూర్పు నుండి పడమర వరకు విస్తరించిన జాతీయ పార్టీగా నిలిచినా, దాని  రాజకీయ ఆరంభం మాత్రం గంగానదీ తీరంలోని బెంగాల్ లోనే మొదలైంది.  ఆ రాజకీయ విత్తనాలు నాటింది..   శ్యామా ప్రసాద్ ముఖర్జీ. కలకత్తా విశ్వవిద్యాలయపు అప్పటి యువ ఉపకులపతి, బెంగాల్‌ అసెంబ్లీలో  ప్రతిపక్ష నాయకుడు, హిందూ మహాసభ అధ్యక్షుడు, స్వతంత్ర భారత తొలి కేబినెట్‌లో పరిశ్రమల మంత్రిగా పనిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. 

డాక్టర్  శ్యామా ప్రసాద్ ముఖర్జీ 1901లో కలకత్తాలో జన్మించారు. ఇంగ్లీష్‌లో బీఏ ఆనర్స్, , బెంగాలీలో ఎంఏ, తరువాత న్యాయ విద్య పూర్తి చేసి, ఇంగ్లండ్‌లో బార్‌కి పిలుపు పొందారు. తిరిగి వచ్చాక న్యాయవాదిగా, విద్యావేత్తగా ఎదిగి, 33 ఏళ్లకే కలకత్తా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియమితులయ్యారు. 1929లో కాంగ్రెస్‌ తరఫున బెంగాల్‌ శాసనసభకు ఎన్నికై..  ఆ తరువాత సిద్ధాంత భేదాల కారణంగా కాంగ్రెస్‌ను వీడారు. 1937 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ప్రతిపక్ష నాయకుడిగా నిలిచారు.  అనంతరం హిందూ మహాసభలో చేరి, ఆ పార్టీ అధ్యక్షుడిగా, బెంగాల్‌ ఆర్థిక మంత్రిగా పనిచేశారు.   వీ.డి. సావర్కర్‌ నేతృత్వంలోని హిందూ మహాసభలో శ్యామా ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. 1943–46 మధ్య ఆ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి,,  బెంగాల్‌లో ముస్లిం లీగ్‌ రాజకీయాలకు ప్రత్యామ్నాయ హిందూ వాదాన్ని నిర్మించేందుకు ప్రయత్నించారు. 

దేశ విభజన తరువాత..  తూర్పు బెంగాల్‌లో హిందువుల భద్రత వంటి అంశాలపై ఆయన గట్టిగా స్పందించినప్పటికీ.. మహాత్మా గాంధీ సలహాతో జవహర్‌లాల్ నెహ్రూ తొలి కేబినెట్‌లో పరిశ్రమలు, సరఫరాల మంత్రిగా చేరారు.  1950లో నెహ్రూ–లియాకత్‌ ఒప్పందం ద్వారా తూర్పు పాకిస్తాన్‌లో హిందువుల భద్రతపై తగిన హామీలు లేవని,  భారత ప్రభుత్వ వైఖరి సంతృప్తికరంగా లేదనీ  భావించి, 1950 ఏప్రిల్‌ 8న తన కేబినెట్ మంత్రి పదవికి   రాజీనామా చేశారు. 

మహాత్మా గాంధీ హత్య అనంతరం హిందూ మహాసభపై వచ్చిన తీవ్ర విమర్శల నేపథ్యంలో, ఆ పార్టీతో తన రాజకీయ అనుబంధాన్ని శ్యామా ప్రసాద్ ముగించారు. ఆ సమయానికి ఆయన  పార్టీ లేని జాతీయ నాయకుడు గా నిలిచారు.  గాంధీ హత్య అనంతరం ఆర్ఎస్ఎస్‌పై నిషేధం, తూర్పు బెంగాల్‌ హిందువుల సమస్య, పాకిస్ధాన్‌తో సంబంధాలపై అసంతృప్తితో కొత్త జాతీయవాద రాజకీయ వేదిక  అవసరాన్ని ఆయన  స్పష్టంగా గుర్తించారు.  ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్‌ ఎం.ఎస్. గోల్వాల్కర్‌తో చర్చలు జరిపి.. ఆ సంస్థకు రాజకీయ భుజం అవసరమని వాదించారు.
1951 మే 5న కలకత్తాలో ఎనిమిది అంశాల ప్రాథమిక కార్యాచరణను ప్రకటించిన శ్యామా ప్రసాద్.. అదే ఏడాది  అక్టోబర్‌ 21న ఢిల్లీలో అధికారికంగా  భారతీయ జనసంఘం  స్థాపనను ప్రకటించారు.  జనసంఘం జెండాగా చతురస్రాకార కాషాయ పతాకాన్ని,  
ఎన్నికల చిహ్నంగా దీపం ను ఆమోదించారు. ఈ దీపం చిహ్నం  అంధకారంలో వెలుగు, విదేశీ సిద్ధాంతాల మధ్య స్వదేశీ ఆలోచన గా ప్రచారం చేశారు.  1951–52 తొలి సాధారణ ఎన్నికల్లో భారతీయ జనసంఘం దేశవ్యాప్తంగా 3.06% ఓట్లు సాధించి, మూడు లోక్‌సభ స్థానాలు గెలుచుకుంది. అవి.. దక్షిణ కలకత్తా.. ఈ స్థానం నుంచి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గెలిచారు. రెండోది.. గుర్గ్రామ్ (మిద్నాపూర్‌ ఈ స్థానం నుంచి  దుర్గాచరణ బెనర్జీ విజయం సాధించారు. ఇకమూడో స్థానం రాజస్థాన్ లోని చిత్తోర్.. ఈ నియోజకవర్గం నుంచి ఉమాశంకర్ త్రివేది విజయం సాధించారు. దీంతో ఆ సాధారణ ఎన్నికలలో లోక్ సభకు ఎన్నికైన ముగ్గురు జనసంఘ్ సభ్యులలో ఇద్దరు పశ్చిమ బెంగాల్ నుంచి గెలవడం గమనార్హం.  గెలిచింది మూడు స్థానాలే అయినా జనసంఘ్ కు జాతీయ పార్టీ హోదా లభించింది.  పార్లమెంటులో డాక్టర్  ముఖర్జీ నేతృత్వంలో  నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్‌  ఏర్పడి, వివిధ ప్రాంతీయ, హిందూ మహాసభ, అకాలి దళ్‌ తదితర పార్టీలతో కలిసి 38 మంది సభ్యుల బ్లాక్‌గా పనిచేసింది. 

1977లో జనసంఘం ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలసి జనతా పార్టీగా విలీనం కాగా..  1980లో ఆ జనతా పార్టీ నుంచి విడిపోయిన జనసంఘం వర్గం  భారతీయ జనతా పార్టీ గా ఏర్పడింది.  బీజేపీ అధికారిక చరిత్రలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీని  జనసంఘ స్థాపకుడు, బీజేపీ ఆలోచనా పితామహుడు గా పేర్కొంటూ, పార్టీ మూలాలను 1951 జనసంఘ స్థాపనతో అనుసంధానిస్తుంది.   బీజేపీ ఆరంభం.. ఢిల్లీ రాజకీయ వేదికపై కనిపించినా..  దాని ఆత్మీయ మూలాలు మాత్రం బెంగాల్‌లోనే ఉన్నాయి.

చరిత్రపరంగా చూస్తే.. బీజేపీ మూలాలు పశ్చిమ బెంగాల్ అనే చెప్పాలి.  తొలి లోక్ సభలో  జనసంఘం ఎంపీలలో 2/3 పశ్చిమ బెంగాల్‌ నుంచే ఎన్నికయ్యారు. తూర్పు బెంగాల్‌ హిందువుల భద్రత, బెంగాల్‌ విభజన, కలకత్తా రాజకీయాలు.. ఇవే జనసంఘ పుట్టుకకు ప్రధాన నేపథ్యం. అయితే నిర్మాణ పరంగా ఇది జాతీయ పార్టీ. ఆర్ఎస్ఎస్‌ దేశవ్యాప్త శృంఖలతో జనసంఘం వేగంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో విస్తరించింది తరువాత బీజేపీగా మారినప్పుడు, గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలు పార్టీ ప్రధాన బలకేంద్రాలుగా మారాయి. బీజేపీని  బెంగాీ పార్టీ అనడం దాని  చారిత్రక మూలాలను గుర్తుచేసే రాజకీయ వాదన మాత్రమే.  సంస్థాగతంగా అది స్పష్టమైన జాతీయ పార్టీ.  

 ఇక ప్రస్తుత  పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో బీజేపీకి బెంగాల్‌తో అసలు సంబంధం లేదు  అనే వాదన తరచూ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో, జనసంఘం తొలి సారిగా బలం ప్రదర్శిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ కావడం, జనసంఘ్ వ్యవస్థాపకుడు స్థాపకుడు బెంగాలీ కావడం.. జనసంఘ్ కు తొలి లోక్ సభలో అత్యధిక స్థానాలు బెంగాల్ నుంచే రావడం.. ఇలా వీటన్నిటినీ కలిపి చూస్తే..  బీజేపీ చరిత్రలో బెంగాల్‌ పాత్ర మూలల లోనే ఉందని చెప్పాలి. 

బీజేపీ నేటి నిర్మాణం, నాయకత్వం, సామాజిక ఆధారం, ఎన్నికల వ్యూహాలు—ఇవన్నీ ఆరంభ జనసంఘ కాలంతో పోలిస్తే పూర్తిగా మారిపోయాయి.కాబట్టి, బీజేపీ  బెంగాలీ పార్టీ  అనే నినాదం చారిత్రక మూలాలను గుర్తుచేసే రాజకీయ వ్యాఖ్యగా మాత్రమే పరిగణించాల్సి ఉంటుంది.  అయితే.. పశ్చిమ బెంగాల్‌ నేడు బీజేపీకి ఎన్నికల యుద్ధభూమి; కానీ చరిత్ర చెబుతున్నది మాత్రం ఇదే నేల ఒకప్పుడు ఆ పార్టీకి జన్మస్థలం కూడా. 

-సీతారాం కంఠంనేని

 References

- Bharatiya Jana Sangh – Origins & History, Wikipedia 
– జనసంఘం స్థాపన, ఆర్ఎస్ఎస్‌ సంబంధం, 1951–52 ఎన్నికల ఫలితాలు. Wikipedia
- Journey of a Lamp –I, Dr. Syama Prasad Mookerjee Research Foundation 
– జనసంఘం ఆవిర్భావ నేపథ్యం, కలకత్తా ప్రకటన, ఆర్ఎస్ఎస్‌తో చర్చలు.  spmrf.org
- History and Development of Bharatiya Janata Party, BJP అధికారిక పత్రం
 – నెహ్రూ–లియాకత్‌ పాక్ట్‌, ఆర్ఎస్ఎస్‌ నిషేధం, జనసంఘం స్థాపన వివరాలు.  Bharatiya Janata Party
- Syama Prasad Mookerjee – Constituent Assembly Member Profile, constitutionofindia.net 
– విద్యా, రాజకీయ నేపథ్యం, రాజ్యాంగ సభలో పాత్ర.  
- Constitution of India
-Syama Prasad Mukherjee – Biography, Bharatpedia 
– హిందూ మహాసభ అధ్యక్షత్వం, నెహ్రూ కేబినెట్‌, జనసంఘ స్థాపన, బీజేపీతో వారసత్వ సంబంధం. Bharatpedia

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే  https://www.teluguone.com/ఫాలో అవ్వండి. షేర్ చేయండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి.  
 

google-ad-img
    Related Sigment News
    • Loading...