భారత టెక్నాలజీకి అమరావతి క్వాంటమ్ వ్యాలీ పునాది : మంత్రి లోకేష్

posted on: Feb 7, 2026 8:18PM

 

అమరావతిలో ఈ రోజు జరిగిన క్వాంటమ్ వ్యాలీ భూమిపూజ కార్యక్రమం కేవలం ఒక నిర్మాణానికి సంబంధించినది కాదని, ఇది భారతదేశ క్వాంటమ్ టెక్నాలజీ భవిష్యత్‌కు పునాది వేసే చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి క్వాంటమ్ వ్యాలీకి భూమిపూజ చేశారు.  

 

 

ఈ సందర్భంగా 14 ప్రముఖ సంస్థలు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ…హైదరాబాద్‌ను ఐటీ రాజధానిగా మార్చిన దూరదృష్టి నాయకత్వం ఇప్పుడు అమరావతిని క్వాంటమ్ విప్లవానికి కేంద్రంగా తీర్చిదిద్దుతోందన్నారు. “క్వాంటమ్ టెక్నాలజీని భారతదేశమే ముందుండి నడిపించాలి అనే ముఖ్యమంత్రి ఆలోచనకు రూపమే అమరావతి క్వాంటమ్ వ్యాలీ” అని పేర్కొన్నారు.

 

 

ఆంధ్రప్రదేశ్‌కు మూడు ప్రధాన బలాలున్నాయని మంత్రి వివరించారు.
👉 సమర్థ నాయకత్వం – సీబీఎన్ విజన్‌కు గ్లోబల్ గుర్తింపు.
👉 వేగవంతమైన పాలన – గూగుల్ డేటా సెంటర్, అర్సెలార్ మిట్టల్ వంటి భారీ ప్రాజెక్టులను రికార్డు సమయంలో సాకారం చేయడం.
👉 స్టార్టప్ స్టేట్ – ఇన్నోవేషన్‌కు అనుకూల వాతావరణం.

 

 

క్వాంటమ్ వ్యాలీలో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, అల్గారిథమ్‌లు, ఉత్పత్తులు, శిక్షణ అన్నీ ఒకేచోట ఉండేలా ఎకోసిస్టమ్ రూపొందిస్తున్నామని తెలిపారు. అమరావతిని ప్రపంచంలోని టాప్ 5 క్వాంటమ్ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టడమే లక్ష్యమని లోకేశ్ అన్నారు. ఇక్కడ భారతదేశంలోనే అత్యాధునిక 133-క్యూబిట్ ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ ఆవిష్కృతం కానుంది. నేషనల్ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ కూడా అమరావతిలోనే ఏర్పాటు కానుంది. ఇప్పటికే 50 వేల మంది యువత శిక్షణ పొందగా, లక్ష మందికి పైగా నైపుణ్యాలు అందించడమే దీర్ఘకాలిక లక్ష్యమని వెల్లడించారు.

 

 

క్వాంటమ్ వ్యాలీ ద్వారా క్వాంటమ్ ఇంజనీర్లు, ఏఐ నిపుణులు, చిప్ డిజైనర్లు, డీప్‌టెక్ రీసెర్చర్లకు భారీ స్థాయిలో హై-క్వాలిటీ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. “మన యువత టెక్నాలజీ వినియోగదారులుగా కాకుండా, సృష్టికర్తలుగా మారాలి” అన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.హైదరాబాద్ ఐటీ విప్లవానికి నాయకత్వం వహించినట్లే, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతి భారత క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహించబోతోందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...