Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన
posted on: Feb 7, 2026 3:26PM

ఆంధ్రప్రదేశ్ను క్వాంటమ్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఏర్పాటు కానున్న ‘క్వాంటమ్ వ్యాలీ’ భవనానికి కేంద్ర మంత్రి జితేంద్రసింగ్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. రెండు వరుసల్లో ఎనిమిది భారీ టవర్లు నిర్మించనున్నారు.
మొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతికి తీసుకురావడంలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సర్స్, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్కేర్, ఫైనాన్స్ వంటి రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి ఈ వ్యాలీ ఉపయోగపడనుంది.
ప్రపంచంలోనే అత్యాధునిక క్వాంటమ్ హబ్ల సరసన అమరావతిని నిలబెట్టాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ను సీఎం రూపొందించారు. ఈ వ్యాలీ ఏర్పాటు వల్ల గ్లోబల్ టెక్ కంపెనీల పెట్టుబడులు, ప్రపంచస్థాయి పరిశోధన కేంద్రాలు, స్టార్టప్ ఎకోసిస్టమ్ విస్తరణ సాధ్యమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. లక్షలాది మంది యువతకు అధునాతన నైపుణ్య శిక్షణ అందుబాటులోకి రానుంది.
ఆగస్టు నాటికి భవన నిర్మాణం పూర్తి చేసి, డిసెంబర్లోపు క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.క్వాంటమ్ టెక్నాలజీ వల్ల సామాన్యుడి జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఫార్మా రంగంలో పరిశోధనలు వేగవంతం అవుతాయి. వ్యవసాయంలో వాతావరణ అంచనాలు, నీటి వినియోగం, దిగుబడి అంచనాలు మరింత కచ్చితంగా ఉండనున్నాయి.
బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీల భద్రత కూడా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ల తయారీకి ప్రపంచ కేంద్రంగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వం క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేష్ తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు






