ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర... కుటుంబసభ్యుల ఆరోపణలు

posted on: Feb 18, 2026 4:36PM

 

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన తోబుట్టువులు సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ తమను బెదిరిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు ఉజ్మా ఖాన్, అలీమా ఖాన్ తెలిపారు. 'వారు నన్ను చంపుతారు. నా హత్యకు వారు పథకం వేశారు' అని ఇమ్రాన్ తమతో జరిపిన సంభాషణలను మీడియాకు వినిపించారు.

'మొహ్సిన్ మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మాకు కానీ, మా సోదరుడికి కానీ ఏమైనా జరిగితే ఎవరినీ వదిలిపెట్టం' అని ఉజ్మా ఖాన్, అలీమా ఖాన్ హెచ్చరించారు. ప్రస్తుతం పాకిస్థాన్ జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్నారు. చీకటి జైలు గదిలో సుదీర్ఘ కాలంగా ఒంటరిగా ఉండడంతో ఆయన కంటి చూపు కోల్పోతున్నారని, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని పాక్ సుప్రీంకోర్టు నియమించిన న్యాయవాది పరిశీలనలో వెల్లడైంది. 

ఇమ్రాన్ కుడి కన్ను చూపు 85 శాతం కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఇమ్రాన్‌కు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. కాగా, ఇమ్రాన్‌ఖాన్‌కు మెరుగైన వైద్యం అందించాలని పలువురు దిగ్గజ క్రికెటర్లు పాక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌కు వైద్య సదుపాయం కల్పించేందుకు పాక్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది

google-ad-img
    Related Sigment News
    • Loading...