మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై ఈఓడబ్ల్యూ ఫోకస్

posted on: Jun 17, 2026 4:55PM

 

గండిపేటలోని విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ కేసులో ఏపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడిని సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాల ఆధారంగా కాజేసేందుకు కుట్ర జరిగినట్లు ఆరోపణలు ఉన్న ఈ కేసులో దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు.పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, గండిపేట సర్వే నంబర్-18లోని 9 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ భూమిని నకిలీ జీవోలు, నకిలీ ప్రభుత్వ పత్రాల ఆధారంగా ప్రైవేట్ ఆస్తిగా చూపించి ఆక్రమించేందుకు కుట్ర జరిగినట్లు గుర్తించారు.

 ప్రస్తుతం ఈ భూమి మార్కెట్ విలువ సుమారు రూ.1,500 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బొల్ల బ్రహ్మనాయుడిని జూన్ 5న తమిళనాడులోని కాంచీపురంలో అరెస్ట్ చేసిన పోలీసులు, అనంతరం హైదరాబాద్‌కు తరలించి చంచల్‌గూడ జైలుకు పంపించారు. కోర్టు అనుమతితో ప్రస్తుతం ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో భూమి వ్యవహారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కీలక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ భూమి డీల్ కోసం సుమారు రూ.12 కోట్లు సమకూర్చినట్లు పోలీసులు గుర్తించగా, అందులో బొల్ల బ్రహ్మనాయుడు వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి రూ.1.25 కోట్లు బదిలీ అయినట్లు ఆర్థిక లావాదేవీల ఆధారాలు సూచిస్తున్నాయి.

నకిలీ జీవోలను ఎవరు రూపొందించారు? ప్రభుత్వ రికార్డుల్లో వాటిని చేర్చేందుకు ఎవరు సహకరించారు? ఈ వ్యవహారం వెనుక మరెవరి పాత్ర ఉంది? అనే అంశాలపై ఈఓడబ్ల్యూ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మధ్యవర్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నకిలీ పత్రాలు తయారు చేసిన వ్యక్తుల పాత్రపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు.ఇప్పటికే పలు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు, బ్యాంకు లావాదేవీల వివరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని విశ్లేషిస్తున్నారు. బొల్ల బ్రహ్మనాయుడు ఇచ్చే సమాచారంతో మరికొందరు సహనిందితుల పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అవసరమైతే మరిన్ని అరెస్టులు కూడా ఉండవచ్చని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో కస్టడీ విచారణ పూర్తయ్యేలోపు మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...