ఐపీఎల్ లో రికార్డుల మోత.. 800ఫోర్ల క్లబ్ లోకి కోహ్లీ..9 వేల పరుగుల మైలురాయికి 11 పరుగుల దూరం

posted on: Apr 25, 2026 9:13AM

ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద పారుతోంది. శుక్రవారం (ఏప్రిల్ 24) బెంగళూరు  చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య జరిగిన మ్యాచ్ లో పాత రికార్డులు బద్దలయ్యాయి. కొన్ని కొత్త రికార్డులు నమోదయ్యాయి.   స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ  చరిత్ర సృష్టించగా, మరోవైపు గుజరాత్ యువ సంచలనం సాయి సుదర్శన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో దిగ్గజాల రికార్డులను తిరగరాశాడు. అభిమానులకు కనువిందు చేసిన ఈ పోరులో ఇరు జట్ల ఆటగాళ్లు వ్యక్తిగత మైలురాళ్లను అధిగమించారు. 

గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగిన యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 58 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేశాడు.   ఈ క్రమంలోనే అతను ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (48 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండగా, సుదర్శన్ కేవలం 47 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి గిల్ ను వెనక్కు  నెట్టేశాడు.

మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై సాయి సుదర్శన్ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో మంచి ఆరంభాలు లభించినప్పటికీ, వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాననీ ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం  ఆత్మవిశ్వాసాన్ని నింపిందనీ పేర్కొన్నాడు. పిచ్ పరిస్థితులను బట్టి తాను ఆడానని, జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించడం సంతృప్తిని ఇచ్చిందని అన్నాడు.  

ఇక కింగ్ కోహ్లీ  ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు బాదిన మొట్టమొదటి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.  పంజాబ్ కింగ్స్ బౌలర్ కగిసో రబాడా బౌలింగ్‌లో బౌండరీ కొట్టడం ద్వారా ఈ ఘనతను సాధించాడు. ప్రస్తుతం ఈ జాబితాలో కోహ్లీ తరువాతి స్థానాలలో శిఖర్ ధావన్ (768), డేవిడ్ వార్నర్ (663), రోహిత్ శర్మ (653)  ఉన్నారు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన వీరుడుగా ఇప్పటికే కొనసాగుతున్న కోహ్లీ, ఇప్పుడు ఫోర్ల సంఖ్యలోనూ అగ్రస్థానానికి చేరడం విశేషం. అంతే కాదు ఐపీఎల్ లో 9 వేల పరుగుల మైలు రాయికి కేవలం 11 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లీ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే.. తరువాతి మ్యాచ్ లోనే ఆ రికార్డు కూడా కోహ్లీ ఖాతాలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.  ఇక పోతే కింగ్ విరాట్ కోహ్లీ కేవలం ఫోర్లతోనే ఆగకుండా సిక్సర్ల విషయంలోనూ  ఘనత సాధించాడు. ఒకే ఫ్రాంచైజీ తరఫున ఆడుతూ 300 సిక్సర్లు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గత 18 ఏళ్లుగా ఆర్సీబీకి కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.  

google-ad-img
    Related Sigment News
    • Loading...