క్రేన్లు కూలి ఐదుగురు దుర్మరణం.. శంకరపల్లిలో ఘోర విషాదం

posted on: Apr 28, 2026 8:55AM

హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి మండలంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా రెండు భారీ  క్రేన్లు కూలిపోవడంతో ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన మహాలింగాపురం గ్రామ పరిధిలోని నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ  సెంట్రల్ వర్క్‌షాప్‌లో చోటుచేసుకుంది.

ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై భారీ గాలివాన మొదలవ్వడంతో మంది కార్మికులు రక్షణ కోసం సమీపంలోని ఒక తాత్కాలిక షెడ్డు కిందకు వెళ్లారు. అయితే, ప్రకృతి ప్రకోపం వారిని మృత్యురూపంలో వెంటాడింది. తీవ్రమైన గాలుల ధాటికి ట్రాకులపై ఉన్న క్రేన్లు అదుపుతప్పాయి. ఒక క్రేన్ వేగంగా కదులుతూ పక్కనే ఉన్న మరో భారీ క్రేన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ తాకిడికి ఆ రెండు యంత్రాలు ఒక్కసారిగా కార్మికులు ఆశ్రయం పొందుతున్న షెడ్డుపై కుప్పకూలాయి.   ఈ ప్రమాదంలో బిహార్‌కు చెందిన నలుగురు, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఒక కార్మికుడు మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు.  గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  మృతదేహాలను పోస్టుమార్టం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

  క్రేన్లను నిలిపి ఉంచే సమయంలో వేయాల్సిన  సేఫ్టీ లాక్ లు వేయకపోవడమే ఈ ఘోరానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే బలమైన గాలులకు క్రేన్లు పట్టాల మీద కదిలి ఒకదానికొకటి ఢీకొన్నాయని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి  పోలీసులు ఎన్సీసీ యూనిట్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. పని ప్రదేశాల్లో కార్మికుల భద్రతను విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని కోరుతున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...