దేశంలో తొలి మ్యూజికల్ రోడ్డు... ముంబై రికార్డు
posted on: Feb 11, 2026 5:03PM

భారత్లోనే తొలి మ్యూజికల్ రోడ్డును ప్రారంభించి గా ముంబై కోస్టల్ రోడ్ అధికారులు రికార్డ్ సృష్టించారు. రోడ్డు అంటే ట్రాఫిక్, హారన్ల మోత, స్పీడ్ బ్రేకర్లు ఇవే గుర్తొస్తాయి. కాని ప్రపంచంలోని కొన్ని దేశాల్లో రహదారులే సంగీతాన్ని వినిపిస్తున్నాయి. వాటినే మ్యూజికల్ రోడ్స్ అంటారు. ప్రత్యేకంగా రోడ్డుపై ఏర్పాటు చేసిన ‘రంబుల్ స్ట్రిప్స్’పై నుంచి దూసుకెళ్తే అవి వైబ్రేషన్ ద్వారా సంగీతాన్ని సృష్టించాయి. సాధారణంగా డ్రైవర్లను అప్రమత్తంగా చేయడానికి అవి ఉపయోగపడతాయి. అమెరికా, రష్యా , జపాన్, దక్షిన కొరియా, డెన్మార్, హంగేరీ వంటి దేశాల్లో అటువంటి సంగీత రహదారులున్నాయి.
ముంబయి కోస్టల్ రోడ్ అధికారులు ఈ వినూత్న ప్రయోగాన్ని ప్రారంభించి దేశానికే ఆకర్షణగా నిలిచారు. హంగేరియన్ సాంకేతికత సహకారంతో కోస్టల్ రోడ్డులో నారిమన్ పాయింట్ నుంచి వర్లి దిశగా వెళ్లే క్యారేజ్వేపై ప్రత్యేక సంగీత స్ట్రిప్లను ఏర్పాటు చేశారు. ఈ స్ట్రిప్లపై వాహనాలు నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తే, సుమారు 700 మీటర్ల పొడవునా 'స్లమ్డాగ్ మిలియనీర్' చిత్రంలోని ప్రసిద్ధ గీతం 'జయ హో' వినిపించేలా రోడ్డును డిజైన్ చేశారు.
దేశానికి అంకితంగా ఈ పాటను ఎంపిక చేసినట్లు, ప్రజల్లో దేశభక్తి భావాన్ని మరింత బలపరచాలనే ఉద్దేశంతోనే ఈ మ్యూజికల్ రోడ్ను రూపొందించినట్లు ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు రూ.6.21 కోట్ల వ్యయం అయ్యిందని అధికారులు తెలిపారు. ముంబయి కోస్టల్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులలో భాగంగా ఈ రహదారిని నిర్మించగా, ఇది దేశంలోనే తొలి మ్యూజికల్ రోడ్డుగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ వినూత్న రహదారిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ బుధవారం అధికారికంగా ప్రారంభించారు.






