ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టి20 సిరీస్.. తొలి మ్యాచ్ వర్షార్పణం

posted on: Jul 2, 2026 9:16AM

 భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య  టి20 సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షార్పణమైంది.  డర్హమ్‌ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ మధ్యలో భారీ వర్షం కారణంగా రద్దైంది.  ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా.. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో  భారీ స్కోరు సాధించినప్పటికీ, వరుణుడు  విరుచుకుపడటంతో మ్యాచ్  ఫలితం తేలకుండానే రద్దయింది.  తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్  ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.  అయితే.. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే డర్హమ్‌ మైదానాన్ని భారీ వర్షం ముంచెత్తింది. కనీసం డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఫలితం తేల్చేందుకు 5 ఓవర్ల మ్యాచ్‌నైనా నిర్వహించాలని అంపైర్లు చాలా సేపు కటాఫ్ సమయం కోసం వేచి చూశారు. కానీ, వర్షం  తగ్గకపోవడంతో  మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు   ప్రకటించారు.

అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే తీవ్రమైన ఎదురుదెబ్బలు తగిలాయి. స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ కేవలం 1 పరుగుకే వెనుతిరగగా, మరో కీలక బ్యాటర్ ఇషాన్ కిషన్ పరుగుల ఖాతా తెరవకుండానే 0 స్కోరుకే  క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ దశలో   అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థి బౌలింగ్ లైన్‌ను తుత్తునియాలు చేస్తూ..  మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. అభిషేక్ శర్మ కేవలం 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 అద్భుతమైన సిక్సర్లతో 59 పరుగులు చేసి స్కోరుబోర్డును రాకెట్ వేగంతో పరిగెత్తించాడు. అతనికి తోడుగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను  ముందుకు నడిపించాడు. ఇంగ్లాండ్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 47 బంతుల్లో 68 పరుగులు చేసి భారత్  భారీ స్కోరుకు దోహదపడ్డాడు. 

ఇక చివరి  ఓవర్లలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే తన పవర్‌హిట్టింగ్‌తో  21 బంతుల్లోనే 42 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి అజేయంగా నిలిచాడు.  ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్   3 వికెట్లు పడగొట్టగా, స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్, ఆల్‌రౌండర్ శామ్ కరన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. భారత బ్యాటర్ల సమిష్టి ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను వారి సొంతగడ్డపైనే ఒత్తిడిలోకి నెట్టేసే సువర్ణావకాశం మన బౌలర్లకు వచ్చినప్పటికీ, వరుణుడి రాకతో ఆ ఉత్సాహమంతా నీరుగారిపోయింది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు స్టేడియానికి వచ్చిన వేలాది మంది అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది. కాగా,  ఈ టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్ జూలై 4న మాంచెస్టర్ వేదికగా జరగనుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...