శేషాచలం అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం

posted on: Apr 27, 2026 9:50AM

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి అతి సమీపంలోని  శేషాచలం అటవీ ప్రాంతంలో సోమవారం (ఏప్రిల్ 27) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జీవకోన అటవీ రేంజ్ పరిధిలోని మొండోడికోన ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అటవీ సంపదకు భారీ నష్టం వాటిల్లింది. మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి.  సమాచారం అందుకున్న వెంటనే  అటవీ శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. సుమారు 50 మందితో కూడిన ప్రత్యేక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అటవీ శాఖ సిబ్బందితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం  అటవీ విభాగం,  అగ్నిమాపక దళం సిబ్బంది  రంగంలోకి దిగి మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర విస్తరించిన మంటలను అదుపు చేశారు. 

ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ ప్రమాదంలో సుమారు 2 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతం   దగ్ధమైంది. విలువైన వృక్ష సంపదతో పాటు అరుదైన వనమూలికలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. మంటల తీవ్రతకు భయపడిన వన్యప్రాణులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశాయి. అటవీ శాఖ అధికారులు   ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఎర్రచందనం నిల్వ చేసే గిడ్డంగులు ఉండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. మంటలు ఆ గిడ్డంగుల వైపు మళ్లకుండా ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు.  ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు   విచారణ జరుపుతున్నారు.   ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో, ఎండిపోయిన గడ్డి మరియు ఆకులు ఘర్షణ వల్ల మంటలు పుట్టాయని భావిస్తున్నారు.   ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...