ఆధునిక సమాచార విప్లవానికి బాటలు వేసిన ఫైబర్ ఆప్టిక్స్ పితామహుడు డాక్టర్ నరేంద్ర సింగ్ కపానీ!

posted on: Jun 5, 2026 10:30PM

నేడు ప్రపంచవ్యాప్తంగా సమాచార మార్పిడి రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన హై-స్పీడ్ ఇంటర్నెట్, వైద్య రంగంలో అత్యాధునిక శస్త్రచికిత్సలకు ఉపయోగపడే ఎండోస్కోపీ వంటి పరికరాల వెనుక ఉన్న అసలైన సాంకేతికత ఫైబర్ ఆప్టిక్స్. ఈ అద్భుత ఆవిష్కరణకు  మూలాలను పరిశీలిస్తే, మనకు వినిపించే అతి ముఖ్యమైన పేరు డాక్టర్ నరేంద్ర సింగ్ కపానీ. భారతీయ మూలాలున్న ఈ అసాధారణ అమెరికన్ భౌతికశాస్త్రవేత్తను ప్రపంచం మొత్తం ఎంతో గౌరవంగా ఫైబర్ ఆప్టిక్స్ పితామహుడుగా  పిలుచుకుంటుంది. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కేవలం పుస్తకాలకో, పరిశోధనా సంస్థలకో పరిమితం చేయకుండా, దానిని సామాన్య మానవుడి దైనందిన జీవితంలో భాగం చేసిన అరుదైన పారిశ్రామిక వేత్త,  దార్శనికుడు డాక్టర్ నరేంద్ర సింగ్ కపానీ. 1926లో పంజాబ్ లోని మొగా అనే చిన్న ప్రాంతంలో జన్మించిన కపానీ, తన మేధోశక్తితో ప్రపంచ సాంకేతిక చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.

ఈ సాంకేతికత వెనుక ఉన్న ప్రధాన భౌతికశాస్త్ర సూత్రం  సంపూర్ణ అంతర్గత ప్రతిఫలనం అంటే టోటల్  ఇంటర్నల్ రిఫ్లెక్షన్.  గతంలో శాస్త్రవేత్తలు వంగి ఉండే గాజు తీగలు లేదా తంతువుల ద్వారా కాంతిని ఒక చోటు నుండి మరొక చోటుకు స్థిరంగా ప్రసారం చేయడం సాధ్యం కాదు అనే అభిప్రాయంతో ఉండేవారు. కానీ 1950వ దశకంలో డాక్టర్ కపానీ ఈ పాత నమ్మకాలను పూర్తిగా తిప్పికొట్టారు. 1953 లో లండన్‌లో ప్రముఖ పరిశోధకుడు హారోల్డ్ హాప్కిన్స్‌తో కలిసి ఆయన చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. అత్యంత నాణ్యమైన చిత్రాలను ఆప్టికల్ ఫైబర్ బండిల్స్ ద్వారా ప్రసారం చేయవచ్చని వారు ప్రపంచానికి ప్రయోగాత్మకంగా నిరూపించి చూపించారు. ఈ ప్రయోగమే భవిష్యత్తులో డిజిటల్ విప్లవానికి బలమైన పునాదిగా మారింది.

డాక్టర్ నరేంద్ర సింగ్ కపానీ విద్యాభ్యాసం ఇండియాలోనే ప్రారంభమైంది. ఆ తర్వాత ఉన్నత విద్యపై ఉన్న ఆసక్తితో ఆయన బ్రిటన్ లోని ప్రసిద్ధ ఇంపీరియల్ కాలేజీకి వెళ్లారు. అక్కడ ఆప్టిక్స్ విభాగంలో విస్తృతమైన పరిశోధనలు చేశారు. అదే సమయంలో ఆయనకు సతిందర్ కౌర్‌తో పరిచయం ఏర్పడి..  అది వివాహ బంధానికి దారితీసింది. ఆ విధంగా లండన్ నగరం ఆయన వ్యక్తిగత,  వృత్తిపరమైన జీవితాల విజయానికి కేంద్ర బిందువుగా నిలిచింది. 1955లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి పీహెచ్‌డీ పట్టా పొందిన అనంతరం, ఆయన తన పరిశోధనలను మరింత విస్తరించడానికి అమెరికా వెళ్లారు. అక్కడ కేవలం పరిశోధనలకే పరిమితం కాకుండా రోచెస్టర్ విశ్వవిద్యాలయం, యూసీ బర్కిలీ, యూసీ శాంటా క్రూజ్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రొఫెసర్‌గా సేవలందిస్తూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు.

1950వ దశకం మధ్య నాటికి కపానీ ఆప్టిక్స్ రంగంలో తిరుగులేని మైలురాళ్లను సృష్టించారు. కపానీ,  హాప్కిన్స్ సంయుక్తంగా చేసిన పరిశోధనా పత్రం 1954లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన  నేచర్  పత్రికలో ప్రచురితమై సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 1960లో  సైంటిఫిక్ అమెరికన్  అనే పత్రికలో ఆయన రాసిన ఒక ప్రత్యేక వ్యాసంలో మొదటిసారిగా  ఫైబర్ ఆప్టిక్స్  అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ రంగానికి సంబంధించి మొట్టమొదటి పాఠ్యపుస్తకాన్ని కూడా ఆయనే రచించడం విశేషం. దీని ద్వారా ఆయన కేవలం ఆవిష్కర్తగానే కాకుండా, ఆ సరికొత్త విజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన పతాకధారిగా గుర్తింపు పొందారు.

డాక్టర్ కపానీ కేవలం ప్రయోగశాలల్లో పరిశోధనలు చేసే శాస్త్రవేత్త మాత్రమే కాదు, అద్భుతమైన వ్యాపార దార్శనికత కలిగిన పారిశ్రామికవేత్త కూడా. తాను కనుగొన్న సాంకేతికత సమాజానికి ఉపయోగపడాలనే లక్ష్యంతో 1960లోనే  ఆప్టిక్స్ టెక్నాలజీ ఇన్కార్పొరేషన్ అనే సంస్థను స్థాపించి వాణిజ్య ఉత్పాదనలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత కాప్ట్రాన్ వంటి విజయవంతమైన కంపెనీలను ఏర్పాటు చేసి.. టెలికమ్యూనికేషన్ రంగంలో సుదూర ప్రాంతాలకు డేటాను చేరవేసే ప్రక్రియను సులభతరం చేశారు. వివిధ నివేదికల ప్రకారం ఆయన పేరు మీద 100 నుండి 120కి పైగా అంతర్జాతీయ పేటెంట్లు నమోదై ఉన్నాయి. ఇది ఆయన నిరంతర ఆవిష్కరణల పటిమకు నిదర్శనంగా నిలుస్తుంది.

విజ్ఞాన శాస్త్రంతో పాటు సామాజిక, సాంస్కృతిక రంగాలపై కూడా ఆయనకు అమితమైన ప్రేమ ఉండేది. సిక్కు సమాజపు సంస్కృతి, కళలు,  భాషను పరిరక్షించాలనే ఉద్దేశంతో 1967లో ఆయన సిక్కు ఫౌండేషన్  ఏర్పాటు చేశారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో విద్యా సంబంధిత పీఠాలను స్థాపించడంతో పాటు, తన వద్ద ఉన్న అరుదైన సిక్కు కళాఖండాల సేకరణను శాన్ ఫ్రాన్సిస్కోలోని ఏషియన్ ఆర్ట్ మ్యూజియానికి విరాళంగా ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు. ఈ విధంగా ఒకవైపు అగ్రశ్రేణి శాస్త్రవేత్తగా ఉంటూనే, మరోవైపు గొప్ప దాతగా,  సంస్కృతి సంరక్షకుడిగా ఆయన సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

శాస్త్రీయ చరిత్రను పరిశీలిస్తే.. ఏదైనా ఒక పెద్ద ఆవిష్కరణ వెనుక అనేక మంది శాస్త్రవేత్తల సమష్టి కృషి ఉంటుంది. ఫైబర్ ఆప్టిక్స్ రంగం కూడా ఎంతో మంది మేధావుల మేధోమథనం నుండి పుట్టుకొచ్చిందే. అయితే కపానీకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే..  ఆయన కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాకుండా దానికి సంబంధించిన నామకరణం, పుస్తకాల రచన, ప్రపంచవ్యాప్త ప్రచారం,  వాణిజ్జ్యీకరణ వంటి అన్ని రంగాలలోనూ అగ్రగామిగా నిలిచారు. అందువల్లనే ఆయనను ఈ రంగ వ్యవస్థాపకుల్లో ఒకరిగా చూడటంతో పాటు  ఫైబర్ ఆప్టిక్స్ పితామహుడు  అని పిలవడం సర్వదా సమంజసమని విశ్లేషకులు భావిస్తారు.

పాశ్చాత్య సాంకేతిక చరిత్రలో భారతీయ మూలాలున్న ఈ మహోన్నత శాస్త్రవేత్తకు లభించాల్సిన అంతర్జాతీయ గుర్తింపు కొంత ఆలస్యంగానే లభించిందనే వాదనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, యూసీ శాంటా క్రూజ్, ఆప్టికా వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఆయన అందించిన సేవలను కొనియాడుతూ ఎల్లప్పుడూ గౌరవించాయి. జాతి, ప్రాంతం అనే గీతలను దాటి ప్రతిభ ఉంటే ప్రపంచాన్ని ఏ విధంగా శాసించవచ్చో నిరూపించిన కపానీ జీవిత ప్రస్థానం రాబోయే తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకం.

ఆధునిక ఇంటర్నెట్ యుగానికి,  గ్లోబల్ కనెక్టివిటీకి నరేంద్ర సింగ్ కపానీ చేసిన కృషే మూలస్తంభం. సముద్రాల గుండా ప్రయాణించే అండర్ వాటర్ కేబుల్ నెట్‌వర్క్‌లు, అత్యాధునిక వైద్య పరికరాలు,  పారిశ్రామిక ఆటోమేషన్ రంగాలు నేడు ఈ స్థాయిలో విస్తరించడానికి ఆయన ఆనాడే  బీజం వేశారు. 2020 లో తన 94వ ఏట ఆయన కన్నుమూసినప్పటికీ, ఆయన సృష్టించిన కాంతి తరంగాలు నేటి డిజిటల్ ప్రపంచాన్ని నిరంతరం నడిపిస్తూనే ఉన్నాయి. సైన్స్, బిజినెస్,  కల్చర్ అనే మూడు విభిన్న రంగాలను సమర్థవంతంగా సమన్వయం చేసిన డాక్టర్ నరేంద్ర సింగ్ కపానీ పేరు సాంకేతిక ప్రపంచంలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.   

google-ad-img
    Related Sigment News
    • Loading...