రామచంద్రయ్య తిక్క కుదిరింది!
posted on: Nov 8, 2014 5:41PM

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా వుందంటే, ఆ పార్టీ నాయకులు జనాల్లోకి వెళ్తే పట్టించుకునేవారే లేకుండా పోయారు. కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఏవైనా విమర్శలు చేసినా ప్రజలు వాటిని ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నారు. రాష్ట్రాన్ని దారుణంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మాట్లాడే కనీస హక్కు కూడా లేదని ప్రజలు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా వున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు జనంలోకి వెళ్ళి నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానాల పాలు అవుతూనే వున్నారు. ప్రజలు ఛీ కొడుతున్నా ఎంతమాత్రం సిగ్గుపడకుండా జనంలోకి వెళ్తూ భంగపడుతూనే వున్నారు. ఇలా భంగపడే సీన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య విషయంలో జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాజధానికి అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చదిద్దడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రాజధాని కోసం విజయవాడ సమీపంలోని 18 గ్రామాలలో భూ సమీకరణ కోసం మంచి ప్రతిపాదనలను కూడా స్థానిక ప్రజలు, రైతుల ముందు వుంచింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించకుండా చేయాలని, స్థానికులు ప్రభుత్వానికి ఎదురు తిరగాలని ఒకవైపు వైసీపీ నాయకులు, మరోవైపు కాంగ్రెస్ నాయకులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. భూ సమీకరణ విషయంలో ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టి తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునే కుట్రలు ఆ ప్రాంతంలో నిర్విరామంగా జరుగుతూ వున్నాయి. ఈ కుట్రలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు గ్రామానికి శనివారం నాడు వెళ్ళారు. అక్కడ ఓ ప్రెస్ మీట్ పెట్టి భూ సమీకరణ ద్వారా తెలుగుదేశ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని, రైతులు ప్రభుత్వం మీద తిరగబడాలని, రాజధాని కోసం భూములు ఇవ్వకూడదని చెప్పడం మొదలుపెట్టారు. ఈయనగారి మాటలు విని స్థానిక రైతులకు ఆవేశం ముంచుకొచ్చింది. అందరూ ఒక్కసారిగా రామచంద్రయ్య మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు ఎంతమాత్రం లేదని ఆయన ముఖం మీదే చెప్పేశారు. కొందరు రైతులైతే రామచంద్రయ్య మీదకి ఆగ్రహంగా వెళ్ళబోతే పోలీసులు జోక్యం చేసుకుని రామచంద్రయ్యని రక్షించారు.
ఈ సందర్భంగా తుళ్ళూరు ప్రాంత రైతులు మాట్లాడుతూ, రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వానికి సహకరించడానికి తాము సిద్ధంగా వున్నామని, భూములను అప్పగించే విషయంలో ప్రభుత్వంతో తాము చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. దుర్మార్గంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు దుష్టబుద్ధితో ఇక్కడకి వచ్చి ఇక్కడి రైతుల మనసులలో విషాన్ని నింపే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటి పనులను తాము ఎంతమాత్రం సహించబోమని అన్నారు. అలాంటి ప్రయత్నం చేసినందుకే రామచంద్రయ్య మీద తాము తిరగబడ్డామని వారు చెప్పారు. దయచేసి ప్రతిపక్ష నాయకులు ఇప్పటికైనా ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలను నడపకుండా రాజధాని నిర్మాణం విషయంలో హుందాగా వ్యవహరిస్తే మంచిదని సూచించారు. ఏవండీ ఎమ్మల్సీ రామచంద్రయ్యగారూ... తుళ్ళూరు రైతుల ఆగ్రహాన్ని ప్రత్యక్షంగా చూశారుగా... తిక్క కుదిరింది కదూ!?




.jpg)

.webp)



