అన్నదాతలు అప్పులు చట్రం నుండి బయటపడేదెప్పుడు?
posted on: Jun 26, 2014 7:51PM
.jpg)
వ్యవసాయ రుణాల మాఫీపై తెదేపా ప్రభుత్వం తెర వెనుక చాలా గట్టి కసరత్తే చేస్తోంది. ఈ వ్యవహారానికి ఒక పరిష్కారం కనుగొనేందుకు వేసిన కోటయ్య కమిటీ సభ్యులు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్ తో ఈ విషయంపై లోతుగా చర్చించారు. కరువులు, తుఫానులతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందనే వారి వాదనతో గవర్నర్ రఘురామ రాజన్ ఏకీభవించినప్పటికీ, అంత పెద్ద మొత్తాలు ఏకపక్షంగా రద్దు చేయడం అసాధ్యమని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అందుకు ప్రత్యామ్నాయ మార్గంగా వ్యవసాయ రుణాలను రీ షెడ్యుల్ చేసేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన అందుకు అంగీకరించినట్లయితే, రైతుల, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ అయిపోయినట్లే భావించవచ్చును. అంతేకాక మళ్ళీ వెంటనే కొత్తగా పంట రుణాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. రుణాలను కనీసం రెండు సంవత్సరాలకి రీ షెడ్యుల్ చేయాలని చంద్రబాబు నాయుడు కోరుతున్నట్లు సమాచారం. అందుకు గవర్నర్ రాజన్ అంగీకరిస్తే తెదేపా ప్రభుత్వంపై పెద్ద భారం దించుకొన్నట్లవుతుంది. ప్రభుత్వానికి రెండేళ్ళ సమయం గనుక ఇచ్చినట్లయితే, అప్పటికీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా కుదుటపడే అవకాశం ఉంటుంది గనుక అప్పుడు ప్రభుత్వానికి వ్యవసాయ రుణాల మాఫీ చేయడం పెద్ద కష్టమేమీ కాక పోవచ్చును.
అన్నదాతలను ప్రభుత్వాలు ఆదుకోవడం అభినందనీయమే. కానీ వారు దశాబ్దాలుగా ఈ అప్పుల చక్రంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, వారిని దాని నుండి బయటపడేసేందుకు ఏ ప్రభుత్వమూ సరయిన ప్రణాళిక రచించలేదు. అసలు దేశప్రజలకు అన్నం పెట్టేందుకు అప్పులు చేయవలసిరావడాన్ని ఏ ప్రభుత్వాలు కూడా తమకు అవమానకరంగా భావించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. రైతులు అప్పులు చేస్తుంటే వాటిని మాఫీ చేయడమే గొప్ప విషయంగా భావించడంకంటే, వారికి ఆ పరిస్తితి రాకుండా వారికి ఇన్ పుట్ సబ్సీడీలు, మార్కెట్ ధరల స్థిరీకరణ, మార్కెట్ యార్డుల ఏర్పాటు, పంటలను నిలవ చేసేందుకు గోదాముల ఏర్పాటు, ఎరువులు, పురుగుల మందులు, వ్యవసాయ పనిముట్లు, నీళ్ళు వంటివి సకాలంలో అందించగలిగితే, ఈ సమస్య నుండి బయటపడవచ్చును.



.gif)

.webp)



