హైదరాబాద్‌లో నకిలీ ఐపీఎస్ ముఠా అరెస్ట్

posted on: Jun 3, 2026 3:27PM

 

హైదరాబాద్ నగర శివార్లలో అసలైన పోలీసులనే తలపించేలా నకిలీ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలను బెదిరిస్తూ భారీ మొత్తాలు దోచుకుంటున్న ముఠాను కూకట్‌పల్లి CCS, జగద్గిరిగుట్ట పోలీసులు ఛేదించారు. తాను ఐపీఎస్ అధికారినని చెప్పుకుంటూ ప్రజలను నమ్మించి, పోలీస్ అధికారుల మాదిరిగా వ్యవ హరిస్తున్న నాగరాజు అనే వ్యక్తితో పాటు అతని ముఠాలోని మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో  సంచలనం విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

నాగరాజు తో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన రాహుల్, ప్రదీప్ కుమార్ మిశ్రా, ఉత్తరప్రదేశ్ కు చెందిన సత్యభాన్ సింగ్, హర్యానాకు చెందిన సునీల్ కుమార్, నాగేంద్ర వర్మ ఈ ఆరుగురు కలిసి  ఒక ముఠాగా ఏర్పడ్డారు. ముఠాకు చెందిన సభ్యులు పోలీస్ యూనిఫాంలు, నకిలీ అధికారిక లెటర్‌ప్యాడ్లు, రబ్బర్ స్టాంపులు, పోలీస్ గుర్తులు, బేడీలు, వాహనాలు ఉపయోగిస్తూ అసలు పోలీసుల్లా వ్యవహరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారు. 

ఈ వ్యవహారంలో ఓ కానిస్టేబుల్ కూడా సహకరించినట్లు గుర్తించిన అధికారులు అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు గత నెలలో పూర్ణచందర్‌రావు (42) అనే వ్యక్తిని నాగరాజు తనను తాను ఐపీఎస్ అధికారిగా పరిచయం చేసుకుని బెదిరింపులకు గురి చేసాడు. అనంతరం నకిలీ పోలీస్ కారులో అతడిని బలవంతంగా సూర్యాపేటకు తీసుకెళ్లి మొదట రూ.1 లక్ష నగదు వసూలు చేశారు. అంతటితో ఆగకుండా ఒత్తిడికి గురిచేసి మరికొన్ని లక్షలు అతని వద్ద నుండి వసూలు చేస్తారు. బాధితుడి వద్ద నుండి మొత్తం రూ.6.26 లక్షలు కాజేసి హైదరాబాద్‌లో వదిలేసి అక్కడి నుండి పరారయ్యారు. వాళ్లు నకిలీ పోలీసులుగా గుర్తించిన బాధితులు వెంటనే పోలీసులను సంప్రదించాడు.

బాధితుడి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. అంబీస్ టెక్నాలజీ సహాయంతో పాత నేరస్థుల డేటాను పరిశీలించి నిందితుల కదలికలను గుర్తించారు. చివరకు ప్రధాన నిందితుడు నాగరాజుతో పాటు రాహుల్, సత్యబాన్, నాగేంద్ర వర్మ మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సునీల్ కుమార్, ప్రదీప్ కుమార్ అనే మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉండగా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నార.. నిందితుల వద్ద నుంచి రెండు తుపాకులు (ఎయిర్ పిస్టల్, కంట్రీమేడ్ పిస్టల్), ల్యాప్‌టాప్, పోలీస్ డ్రస్సులు, కారు, బైక్, లెటర్‌ప్యాడ్లు, బేడీలు, పలు రబ్బర్ స్టాంపులు, 10 మొబైల్ ఫోన్లు, పోలీస్ హోదాలను సూచించే గుర్తులు స్వాధీనం చేసుకున్నారు. 

ప్రధాన నిందితుడు నాగరాజు సాధారణ నేరస్థుడు కాదని పోలీసులు వెల్లడించారు. అతనిపై ఇప్పటికే 12 క్రిమినల్ కేసులు నమోదై ఉండటంతో పాటు రెండు పీడీ యాక్టులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అతనిపై రౌడీషీట్ కూడా కొనసాగుతోంది. అయినప్పటికీ అతని నేరప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని,అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నామనికుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామనికుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఖాకీ చొక్కా వెనుక దాగున్న ఇలాంటి నకిలీ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...