ఇథనాల్ పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం మినహాయింపు.. కేంద్రం సంచలన నిర్ణయం

posted on: Jun 11, 2026 10:10AM

పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  పెట్రోల్‌లో అధిక శాతం ఇథనాల్‌ను కలిపి విక్రయించే సరికొత్త ఇంధన రకాలపై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా మినహాయించింది. పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛ ఇంధనాల వినియోగాన్ని   ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.  

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. పెట్రోల్‌లో 22 శాతం నుండి 30 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం ఉండే సరికొత్త ఇంధన రకాలకు ఈ పన్ను మినహాయింపు లభించనుంది. దీని పరిధిలోకి ఈ22 , ఈ25 , ఈ27,  ఈ30 రకాలు వస్తాయి.  ఈ నిర్ణయం దేశీయ ఇంధన మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు వేదిక కానుందని పర్యవారణ, ఆర్థిక నిపుణులు అంటున్నారు. సాధారణంగా లీటర్ పెట్రోల్‌పై పడే ఎక్సైజ్ సుంకం భారం తగ్గడం వల్ల, రాబోయే రోజుల్లో ఈ ఇంధనాలు వినియోగదారులకు మరింత అందుబాటు ధరల్లోకి వచ్చే అవకాశం ఉంది. 

ప్రస్తుతం భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం అత్యధికంగా ఇతర దేశాల దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ అంతర్జాతీయ దిగుమతుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవడం..  అదే సమయంలో దేశీయంగా వ్యవసాయ ఆధారిత వనరుల నుండి ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన ఇథనాల్ వినియోగాన్నిపెంచడం ఈ నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు.  దీనివల్ల దేశీయంగా ఇథనాల్‌ను ఉత్పత్తి చేసే రైతాంగానికి, పరిశ్రమలకు ఆర్థికంగా మేలు జరుగుతుంది.

నిజానికి..  ఈ పన్ను మినహాయింపు ప్రకటనకు కొన్ని రోజుల ముందే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్  ఈ22, ఈ25, ఈ27, ఈ30 పెట్రోల్ మిశ్రమాలకు సంబంధించిన సరికొత్త నాణ్యతా ప్రమాణాలను  విడుదల చేసింది. ఇంధనంలో ఇథనాల్ శాతం ఎంత ఉండాలి, ఆక్టేన్ రేటింగ్ ఏ స్థాయిలో నిర్వహించాలి, సల్ఫర్ పరిమితులు ఎంతవరకు ఉండాలి అనే సాంకేతిక,  భద్రతాపరమైన కఠిన నిబంధనలను ఇప్పటికే అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు తాజాగా కేంద్రం   ఎక్సైజ్ సుంకం మినహాయింపు కూడా ఇవ్వడంతో, ఈ సరికొత్త ఇంధన రకాల తయారీకి,  మార్కెటింగ్‌కు అవసరమైన పూర్తి సాంకేతిక, ఆర్థిక మద్దతు లభించినట్లయింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...