Latest News

ఈటల మళ్లీ కారెక్కేస్తున్నారా?

posted on: Jan 30, 2026 1:13PM

ఈటల రాజేందర్.. తెలంగాణ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. వామపక్ష భావజాలం ఉన్న ఆయన తెలంగాణ సాధన ఉద్యమంలో కేసీఆర్ తో అడుగు కలిపి నడిచారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ తో అడుగు కలిపి, ఆ పార్టీ సీనియర్ నేతగా సుదీర్ఘ కాలం సేవలందించారు.  తెలంగాణ ఆవిర్భావం తరువాత   తొలి సారి రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. బీఆర్ఎస్ రెండో సారి గెలిచిన తరువాత తొలి కేబినెట్ లో స్థానం దక్కకపోయినా, కేబినెట్ విస్తరణ సమయంలో మళ్లీ మంత్రిగా అవకాశం దక్కింది. సరే తరువాత తరువాత కేసీఆర్ తో విభేదాలు తలెత్తాయి అది వేరే సంగతి. కానీ బీఆర్ఎస్ లో ఉంటూనే ఆత్మగౌరవ నినాదంతో ఆయనను ధిక్కరించి పార్టీ నుంచి బయటకు వచ్చిన సాహసోపేత నాయకుడిగా తెలంగాణ సమాజం ఆయనను గుర్తుం చుకుంటుంది. 

బీఆర్ఎస్ అధినేతతో విభేదించిన ఈటల కాంగ్రెస్ గూటికి చేరతారనే అప్పట్లో అంతా అనుకున్నారు. అయితే అనేక తర్జన భర్జనల అనంతరం ఆయన అనూహ్యంగా బీజేపీలో చేరారు. అప్పట్లో ఈటల బీజేపీ గూటిక చేరడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తం అయ్యింది. రాజకీయ అనివార్యతే ఈటల కాషాయం గూటికి చేరడానికి కారణమని సరిపెట్టుకున్నా.. బీజేపీలో చేరినప్పటి నుంచీ ఆయన ఒంటరే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. అందుకు తగ్గట్టుగానే గతంలో పలుమార్లు ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పడం ఖాయమన్న వార్తలు పలు మార్లు గట్టిగా వినిపించాయి. అయితే పార్టీలో ఉక్కపోతను తట్టుకుంటూ ఆయన బీజేపీలోనే కొనసాగుతూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో బీజేపీలో ఈటలకు పొమ్మనలేక పోగపెడుతున్నారా? అన్న అనుమానాలు కలిగేలా పరిణామాలు సంభవించాయి. ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో పలు చోట్ల కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్, అలాగే ఈటల వర్గీయులు కూడా బీజేపీ అభ్యర్థులుగానే  ప్రత్యర్థులుగా బరిలో నిలబడ్డారు. ఈ పోటీలో బండి వర్గీయులే విజయం సాధించారు. అక్కడితో ఆగకుండా ఆ తరువాత బండి సంజయ్ పీఆర్వో సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఈటలకు బీజేపీలో కనీస గుర్తింపు కూడా కరవయ్యిందా అన్న అనుమానాలు కలిగేలా ఉన్నాయి.

పంచాయతీ ఎన్నికలలో ఈటల వర్గీయులకు బీజేపీ మద్దతు ఇవ్వలేదని బండి సంజయ్ పీఆర్వో అనడం బీజేపీలో అంతర్గత పోరు ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసింది.  బండి సంజయ్ పీఆర్వో వ్యాఖ్యలకు ఈటల ఇచ్చిన కౌంటర్ అప్పుడే ఈటల తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయిపోయారనేలా ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈటల కేసీఆర్ నా బాస్ అంటూ చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ గా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.  తాజాగా మల్కాజ్ గిరి నియోజకవర్గ పరిధిలో   పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈటల రాజేందర్ ఆ నియోజకవర్గ ఎంపీ హోదాలో శంకుస్థాపన చేశారు.

ఆ కార్యక్రమానికి అదే మల్కాజ్ గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ మర్రి రాజశేఖరరెడ్డి బాస్.. అదే మా బాస్  కేసీఆర్ అంటూ ఈటల అన్నారు. ఈ వ్యాఖ్యలు ఈటల నోటి నుంచి పొరపాటుగా వచ్చాయని బీజేపీ వర్గీయులు అంటున్నప్పటికీ.. రాజకీయవర్గాలలో మాత్రం ఈటల బీజేపీకి దూరం కావడం ఖాయమన్న సంకే తాలుగా చర్చ జరుగుతోంది.   ఈటల బీఆర్ఎస్ లో చేరతారని, అందుకే ఇలా మాట్లాడారు అని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...