Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎల్ఈటీ కీలక నేత.. షేక్ యూసుఫ్ అఫ్రిది హతం
posted on: Apr 27, 2026 5:41PM
.webp)
పాకిస్థాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద సంస్థల కీలక నేతలే లక్ష్యంగా సాగుతున్న దాడులు సరికొత్త మలుపు తిరిగాయి. నిషేధిత ఉగ్ర సంస్థ లష్కర్-ఎ-తయిబా (ఎల్ఈటీ)లో అత్యంత కీలకమైన వ్యక్తి, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్కు అత్యంత నమ్మకస్తుడైన షేక్ యూసుఫ్ అఫ్రిది హత్యకు గురయ్యాడు. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో జరిగిన ఈ ఘటనతో ఉగ్ర వర్గాల్లో కలకలం రేగింది. అత్యంత పకడ్బందీగా జరిగిన ఈ దాడి.. పాక్లో ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా సాగుతున్న క్రమబద్ధమైన ఆపరేషన్గా విశ్లేషకులు భావిస్తున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. షేక్ యూసుఫ్ అఫ్రిది తన కదలికలను గోప్యంగా ఉంచినప్పటికీ.. దుండగులు అతడిని వెంబడించి మరీ కాల్పులు జరిపారు. చాలా దగ్గరి నుంచి కాల్చడంతో అఫ్రిది ప్రాణాలు అక్కడిక్కడే మరణించాడు. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు సమీపంలోని దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల వైపు తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ దాడి జరిగిన తీరు చూస్తుంటే ఇది ఆకస్మికంగా జరిగినది కాదనీ, పక్కా ప్రణాళికతో అమలు చేసిన టార్గెట్ కిల్లింగ్ అని స్పష్టమవుతోంది. హతుడు యూసుఫ్ అఫ్రిది ఎల్ఈటీలో ఫీల్డ్ కమాండర్ మాత్రమే కాదు.. ఆ సంస్థకు ఒక మేధావిగా, సిద్ధాంతకర్తగా కూడా గుర్తింపు పొందాడు. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలో ఉగ్రవాదుల నియామకాలు, వారికి ఆయుధ శిక్షణ, స్థానిక నెట్వర్క్ను బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించేవాడు. ముఖ్యంగా అఫ్రిది తెగకు చెందినవాడు కావడంతో తన సామాజిక సంబంధాలను ఉపయోగించుకుని ఉగ్ర కార్యకలాపాలను విస్తరించాడు. భారత సరిహద్దుల్లో, ముఖ్యంగా జమ్మూ-కాశ్మీర్లో అశాంతిని రేకెత్తించేందుకు అవసరమైన లాజిస్టికల్ మద్దతును సమకూర్చడంలోనూ ఇతని హస్తం ఉన్నట్లు బలమైన అనుమానాలు, ఆధారాలూ కూడా ఉన్నాయి.
ఈ హత్య వెనుక ఉన్నదెవరు అనే దానిపై ప్రస్తుతం అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడికి బాధ్యత వహించలేదు. ఉగ్రవాద సంస్థల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు, నిధుల కోసం జరిగే ఆధిపత్య పోరు ఈ హత్యకు దారితీసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అలాగే.. పాకిస్థాన్పై అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి కారణంగా.. తమ గడ్డపై ఉన్న ఉగ్రవాదులను వదిలించుకునేందుకు అక్కడి ఏజెన్సీలే రహస్య ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్లో ఉగ్ర నేతలు వరుసగా హతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 30 మందికి పైగా టెర్రరిస్టులు ఇలాంటి దాడుల్లోనే హతమ్యారు.
గతంలో హఫీజ్ సయీద్ సన్నిహితుడు అబూ ఖతల్, జైష్ నేత మౌలానా మసూద్ అజర్ సోదరుడు తాహిర్ అన్వర్ వంటి వారు కూడా అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ వరుస ఘటనలు చూస్తుంటే.. ఒకప్పుడు పాకిస్థాన్ అండతో పెరిగిన ఉగ్ర శక్తులు ఇప్పుడు అవే శక్తుల చేతిలో లేదా గుర్తుతెలియని శత్రువుల చేతిలో తుడిచిపెట్టుకుపోతున్నట్లు కనిపిస్తోంది.యూసుఫ్ అఫ్రిది మరణం లష్కర్ సంస్థకు కోలుకోలేని దెబ్బగా పరిగణించవచ్చు. ఒక కీలకమైన సమన్వయకర్తను కోల్పోవడం వల్ల ఆ సంస్థ కార్యకలాపాల్లో తాత్కాలికంగానైనా సరే స్తబ్దత ఏర్పడే అవకాశం ఉంది. ఏదిఏమైనా పాకిస్థాన్లో సాగుతున్న ఈ అదృశ్య యుద్ధం ఆ దేశ అంతర్గత భద్రతా సమీకరణాలను మారుస్తోందనడంలో సందేహం లేదు.
- సీతారాం కంఠంనేని



.webp)


