బీజేపీకి జగన్ బీ-టీమ్... షర్మిల ఫైర్

posted on: Feb 14, 2026 7:24PM

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి నిప్పులు చెరిగారు. కడప జిల్లాలో సాగుతున్న 'ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర'లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ పేరుకే ప్రతిపక్షమని, వాస్తవానికి అది బీజేపీ కూటమిలో అంతర్భాగమని సంచలన వ్యాఖ్యలు చేశారు. "బీజేపీతో టీడీపీ, జనసేనది సక్రమ సంబంధమైతే.. వైసీపీది అక్రమ సంబంధం" అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కంటే జగన్‌కు తన సొంత ప్రయోజనాలే ముఖ్యమని, అందుకే మతతత్వ బీజేపీకి వైసీపీ 'బీ-టీమ్'లా మారిందని విమర్శించారు.

*​రాష్ట్ర ప్రజలకు ద్రోహం..

​రాష్ట్రంలో ముస్లింలు, క్రైస్తవుల ఓట్లతో గెలిచిన జగన్, ఢిల్లీకి వెళ్ళగానే మతతత్వ బీజేపీకి దాసోహం అవుతున్నారని షర్మిల మండిపడ్డారు. "వైఎస్సార్ కొడుకునని చెప్పుకునే జగన్, అదే వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడిగా మారడం సిగ్గుచేటు" అని ధ్వజమెత్తారు. తనపై ఉన్న అవినీతి కేసులు, అక్రమ ఆస్తుల వ్యవహారం నుంచి తప్పించుకోవడానికే జగన్ మోదీ ముందు సాగిలపడ్డారని ఘాటుగా విమర్శించారు. అందుకే కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నా జగన్ నోరు మెదపడం లేదని ఆరోపించారు.

*​గాంధీని చంపిన గాడ్సే వారసులే వీరు..

​నాడు గాడ్సే గాంధీని భౌతికంగా హతమార్చితే, నేడు మోదీ పథకానికి గాంధీ పేరు తొలగించి మళ్ళీ చంపారని, జగన్ దీనికి మౌనంగా సహకరిస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా రాష్ట్రంపై రూ. 5 వేల కోట్ల భారం పడే విబిజి రామ్ జి  చట్టానికి జగన్ మద్దతు తెలపడం పేదల పొట్ట కొట్టడమేనని అన్నారు. "మత రాజకీయాలతో దేశాన్ని విభజిస్తున్న బీజేపీకి మద్దతిస్తున్న వైసీపీకి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది" అని హెచ్చరించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా, విభజన హామీలు అమలు కాకపోయినా జగన్, చంద్రబాబులిద్దరూ మోదీ కాళ్ళ దగ్గర పడి ఉన్నారని ఆమె విమర్శించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...