ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్ర : షర్మిల
posted on: Feb 12, 2026 2:09PM
.webp)
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం ఆఖంపేటలో జరిగిన 'ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర'లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శల వర్షం కురిపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధర, ఆరోగ్యశ్రీ, మరియు మహిళలకు పావలా వడ్డీ రుణాలతో స్వర్ణయుగం సాగిందని గుర్తుచేసిన ఆమె, ప్రస్తుతం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఉపాధి కూలీలకు వేతనాల చెల్లింపులో నెలల తరబడి ఆలస్యం జరుగుతోందని, గ్రామసభల హక్కులను కాలరాస్తూ ఈ పథకాన్ని కాంట్రాక్టర్లకు లేబర్ సప్లై చేసే విధంగా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు.
కేంద్రం తన వాటాను 100% నుండి 60% కి తగ్గించాలనే ఆలోచన రాష్ట్రంపై అదనపు భారం మోపడమేనని, ఇప్పటికే లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ఏపీకి ఇది గొడ్డలి పెట్టు వంటిదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, పోలవరం వంటి రాష్ట్ర ప్రయోజనాలపై ఎంపీలు ఢిల్లీలో గళమెత్తలేదని విమర్శిస్తూ, రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని, ప్రజల తరపున పోరాడేందుకు తాము సిద్ధమని ఆమె పిలుపునిచ్చారు.


.webp)



