జూన్ 19 ఏపీలో విద్యా పండుగ.. ఒకే రోజు మూడు బృహత్తర కార్యక్రమాలు!

posted on: May 18, 2026 2:44PM

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే కొత్త విద్యా సంవత్సరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.  ఈ ఏడాది జూన్ నుంచి 2026-27 విద్యాసంవత్సరం ఆరంభాన్ని ఓ భారీ విద్యాపండుగగా నిర్వహించేందుకు సమాయత్తమౌతోంది. ఆ రోజు అంటే రానున్న విద్యాసంవత్సరం మొదటి రోజునే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బడుల్లోనూ  ఏకకాలంలో మూడు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అవేంటంటే అదే రోజున తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాలో జమచేయనుంది. అలాగే అదే రోజు అంటే పాఠశాలలె తెరిచిన తొలి రోజునే విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రిని అందించనుంది. అలాగే అదే రోజు మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ నూ నిర్వహించనుంది. 

బడులు తెరిచిన తొలి రోజే విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడంతో పాటు, వారి తల్లుల ఖాతాల్లోకి 'తల్లికి వందనం' పథకం కింద ఆర్థిక సాయాన్ని నేరుగా జమ చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనితెలుగుదేశం కూటమి సర్కార్ పచ్చజెండా ఊపింది.

ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి, పేద విద్యార్థుల చదువులకు సంపూర్ణ భరోసా కల్పించడమే లక్ష్యంగా ఇవి అమలు చేయనున్నారు.  వైసీపీ హయాంలో  పాఠశాలలు ప్రారంభమై నెలలు గడిచినా పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందేవి కావనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా అమ్మఒడి నిధుల కోసం లబ్ధిదారులు మరుసటి ఏడాది వరకు నిరీక్షించాల్సి వచ్చేది. ఈ లోపాలకు స్వస్తి పలుకుతూ, విద్యా సంవత్సరం మొదటి రోజే అర్హులైన తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 15,000 చొప్పున నగదు జమ చేయడానికి సర్కారు నిధులు సిద్ధం చేసింది.  కేవలం నగదు బదిలీ మాత్రమే కాకుండా, విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా అదే రోజు స్టూడెంట్ కిట్ల పంపిణీని కూడా పూర్తి చేయనుంది. ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, మూడు జతల యూనిఫాం, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్‌లతో కూడిన  విద్యా కిట్‌ను విద్యాసంవత్సరం మొదటి రోజే విద్యార్థుల చేతుల్లో పెట్టేలా అధికారులు  ఏర్పాట్లు  చేస్తున్నారు. దీనివల్ల కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. 

ఇక అదే రోజున అంటే.. జూన్ 19న రాష్ట్రవ్యాప్తంగా  మెగా పేరెంట్-టీచర్ మీట్  నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా కార్పొరేట్ విద్యాసంస్థలకే పరిమితమైన ఈ సంస్కృతిని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టడం ద్వారా, పిల్లల విద్యా ప్రణాళికలు, డిజిటల్ లెర్నింగ్,  వారి ప్రవర్తనపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఒకే వేదికపై చర్చించే అవకాశం లభిస్తుంది. విద్యావ్యవస్థలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని ప్రత్యక్షంగా పెంచడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది.

నిధుల విడుదల, విద్యా కిట్ల పంపిణీ, మరియు ఉపాధ్యాయ-తల్లిదండ్రుల సమావేశం.. ఈ మూడింటినీ ఒకే రోజున సంపూర్ణంగా నిర్వహించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం   పెరుగుతుందని విద్యా రంగ నిపుణులు అంటున్నారు. సకాలంలో అందుతున్న ఈ ప్రోత్సాహకాల వల్ల  డ్రాపౌట్స్  సంఖ్య గణనీయంగా తగ్గి, రాష్ట్రంలో అక్షరాస్యత రేటు మరింత మెరుగవుతుందని విద్యాశాఖ భావిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపైసర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...