తిరుమల లడ్డూ వివాదం.. హవాలా కోణంపై ఈడీ దర్యాప్తు
posted on: Feb 10, 2026 9:58AM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటరైంది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి, సొమ్ము మళ్లింపు, హవాలా లావాదేవీల ఆరోపణలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారికంగా విచారణ ప్రారంభించింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధ్వర్యంలో ఏర్పాటు అయిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) ఇప్పటికే కీలక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. లడ్డూ తయారీలో ఉపయోగించే ముడి సరుకుల సరఫరా, టెండర్ల మంజూరు, నాణ్యత తనిఖీల్లో చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు చేసిన సిట్ భారీ మొత్తంలో అక్రమ లాభాలు వచ్చినట్టు, ఆ నిధులను హవాలా మార్గంలో మళ్లించినట్టు గుర్తించినట్లు సమాచారం.
సిట్ నివేదిక ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. సిట్ నుంచి వివరాలు స్వీకరించిన ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తును ముమ్మరం చేసినట్లు సమాచారం. సిట్ నివేదిక ప్రకారం.... లడ్డూ తయారీకి సంబంధించిన కొన్ని కాంట్రాక్టుల ద్వారా వచ్చిన లాభాలను హవాలా మార్గంలో దేశంలోని పలు నగరాలకు తరలించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, విజయవాడకు హవాలా రూపంలో డబ్బులు చేరినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నిధుల మళ్లింపు వెనుక క్రమబద్ధమైన హవాలా నెట్వర్క్ పని చేసినట్టు ఈడీ భావిస్తోంది.
ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ వ్యవహారంలో సుమారు 234.5 కోట్లకు పైగా నిధుల మళ్లింపు జరిగినట్టు సమాచారం. ఈ మొత్తాన్ని పలు విడతలుగా, భిన్న మార్గాల్లో తరలించినట్లు భావిస్తున్నారు.ఈ అక్రమ లావాదేవీల్లో పోమిలి జైన్, విపుల్ జైన్తో పాటు బోలే బాబా ఆర్గానిక్ కంపెనీ ప్రమేయం ఉన్నట్లు ఈడీ గుర్తించినట్టు సమాచారం. లడ్డూ తయారీకి అవసరమైన ముడి సరుకుల సరఫరా పేరుతో ఒప్పందాలు పొందిన సంస్థలు, వాటి ద్వారా వచ్చిన లాభాలను హవాలా మార్గంలో మళ్లించినట్టు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.ఈ వ్యవహారం లో మధ్యవర్తులు, సరఫరా దారులు, కొందరు అధికారు ల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
నిధుల బదలాయింపునకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఆధారాలపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. బ్యాంకింగ్ లావాదేవీలు, డిజిటల్ ట్రాన్సాక్షన్లు, కమ్యూనికేషన్ డేటా, హవాలా ఏజెంట్ల లింకులపై లోతైన విశ్లేషణ చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికే కీలక డిజిటల్ ఆధారాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. లడ్డూ తయారీలో ఉపయో గించే నెయ్యి నాణ్యత విషయంలో కూడా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. నాణ్యత ప్రమాణా లకు అనుగుణంగా లేని నెయ్యిని సరఫరా చేసినా, ల్యాబ్ నివేదికలను దాచిపెట్టి సరఫరా కొనసా గించేందుకు కొందరు అధికారులు సహకరించారని సిట్ పేర్కొన్నట్టు సమాచారం.
కాగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా భావించే తిరుమల లడ్డూ వ్యవహారంలో ఇలాంటి ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది టీటీడీ ప్రతిష్ఠకు భగం కలగడమే కాకుండా, కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసే అంశంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈడీ విచారణ వేగవంతం కావడంతో రాబోయే రోజుల్లో సంబంధిత వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. అవసరమైతే ఆస్తుల అటాచ్ మెంట్, అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. టీటీడీ లడ్డూ కేసులో హవాలా మలుపుతో ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.


.webp)



