నౌహిరా షేక్ కేసులో ఐఏఎస్ అధికారి ని విచారించిన ఈడి

posted on: May 26, 2026 10:20AM

హీరా గ్రూప్‌ అధినేత్రి నౌహిరా షేక్ కు సంబంధిం చిన మనీలాండరింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు లో భాగంగా ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఐఏఎస్ అధికారి  అమోయ్ కుమార్  సుదీర్ఘంగా ప్రశ్నించారు. దాదాపు 11 గంటల పాటు కొనసాగిన ఈ విచారణలో హీరా గ్రూప్‌కు చెందిన ఆస్తుల విక్రయాలు, అనుమతులు, అధికారిక నిర్ణయాలపై వివరణలు కోరినట్లు సమాచారం. హీరా గ్రూప్‌పై మనీలాండరింగ్‌, పెట్టుబడిదారుల మోసం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఇప్పటికే పలు ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ అటాచ్‌ చేసిన ఆస్తులను విక్రయించేందుకు అనుమతులు ఇచ్చే ప్రక్రియలో అమోయ్ కుమార్ సహకరించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 

నౌహీరా షేక్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ, ఆస్తుల అమ్మకాల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారనే అనుమానాలపై ఈడీ అధికారులు అమోయ్ కుమార్ పైప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. విచారణ సందర్భంగా హీరా గ్రూప్‌కు చెందిన భూములు, భవనాలు, ఇతర ఆస్తుల బదిలీలపై పలు పత్రాలను ఈడీ అధికారులు పరిశీలించినట్లు సమాచారం. అలాగే సంబంధిత ఫైళ్ల క్లియరెన్స్‌, అధికారిక అనుమతుల జారీ, ప్రభుత్వ నిబంధనల అమలు వంటి అంశాలపై కూడా అమోయ్ కుమార్‌ను వివరణ కోరినట్లు తెలిసింది.

ఈ కేసులో నౌహీరా షేక్‌ ఆస్తుల అమ్మకాల వెనుక అధికార యంత్రాంగంలోని కొందరి పాత్ర ఉందా అనే కోణంలో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే హీరా గ్రూప్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడిదారుల నుంచి సేకరించిన నిధుల వినియోగంపై ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా ఐఏఎస్ అధికారి విచారణకు హాజరుకావడం ఈ కేసులో మరింత ప్రాధా న్యత సంతరించుకుంది.

విచారణ అనంతరం అమోయ్ కుమార్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. మరోవైపు, అవసరమైతే మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉందని ఈడీ వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...