ఐ బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ
posted on Nov 19, 2025 8:53AM

ఐ బొమ్మ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చింది. ఐ బొమ్మ ఆర్థిక లావాదేవీలు పెద్ద ఎత్తున క్రిప్టో తో పాటు హవాలా పద్ధతిలో కూడా సాగినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మనీ మనీలాండరింగ్ తో పాటు విదేశీ మారకద్రవ్యం రూపంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లుగా పోలీసులు తేల్చారు. దీంతో కేసు దర్యాప్తులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఐబొమ్మ రవి కేసుకు సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాల్సిందిగా పోలీసులను కోరింది. ఆ వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఈడీ ప్రకటించింది..
మనీ లాండరింగ్ కోణంలో అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈడి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు అధికారికంగా లేఖ రాసి, కేసుకు సంబంధించిన సంపూర్ణ వివరాలు పంపించాలని కోరింది. పోలీసులు ఇప్పటికే నిందితుడు ఇమ్మడి రవి బ్యాంక్ ఖాతాల్లో జరిగిన అనుమానాస్పద లావాదేవీలను దృష్టిలో పెట్టుకుని, అతని ఖాతా నుండి 3.5 కోట్లు ఫ్రీజ్ చేశారు. అదే విధంగా విదేశీ బ్యాంక్ ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో నిధులు రవి ఖాతాలకు చేరినట్టు పోలీసులు గుర్తించారు.
క్రిప్టో కరెన్సీ ఛానళ్ల ద్వారా నెలకు 15 లక్షల వరకు రవికి చెందిన ఎన్ఆర్ఈ అకౌంట్కి బదిలీ అయినట్టు పోలీసు దర్యాప్తులో చేరింది. ఈ నిధుల మార్గాలు, మూలాలు తదితర అంశాలపైఈడి దర్యాప్తు చేయనుంది. ఐబొమ్మ పైరసీ కేసు సైబర్ క్రైమ్ పరిమితులను దాటినందున, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలువెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.