ఏపీ మద్యం కుంభకోణం కేసు.. రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసిన ఈడీ

posted on: Jun 11, 2026 12:58PM

ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తొలి అరెస్టు చేసింది. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ..  ఏపీ మద్యం కుంభకోణంలో    తెరవెనుక ఉండి మొత్తం వ్యవహారాన్ని నడిపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నిందితుడు రాజ్‌ కేసిరెడ్డిని గురువారం (జూన్ 11) అరెస్ట్ చేసింది.  

ఈ అరెస్ట్‌కు ముందు..  తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌తో పాటు  తెలుగు రాష్ట్రాలలో మొత్తం 10  ప్రాంతాల్లో ఈడీ బృందాలు గురువారం (ఏప్రిల్ 11) ఉదయం  నుంచే విస్తృతంగా సోదాలు చేపట్టాయి. రాజ్‌ కేసిరెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలే లక్ష్యంగా జరిగిన ఈ సోదాలలో  కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఈ కుంభకోణంలో..  ప్రైవేటు వ్యక్తులే కాకుండా, వైసీపీ హయాంలో కీలక బాధ్యతల్లో ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారుల పాత్ర కూడా  ఉన్నట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. ఇందులో భాగంగానే ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసాలతో పాటు,  ఆయన ముఖ్య అనుచరుడు, బంధువు అయిన నరసింహారెడ్డి నివాసం, వ్యాపార సంస్థల్లోనూ ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. 

వైసీపీ  హయాంలో జరిగిన ఈ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, భారీగా నిధులను మళ్లించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ముఖ్యంగా హవాలా మార్గాల ద్వారా, మనీలాండరింగ్‌ ( పద్ధతుల్లో వందల కోట్ల రూపాయల అవినీతి సొమ్మును విదేశాలకు  తరలించినట్లు ఈడీ  ఆధారాలు సేకరించింది. ఈ హవాలా నెట్‌వర్క్‌ను నడపడంలో రాజ్‌ కేసిరెడ్డి అత్యంత కీలక పాత్ర పోషించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే ఆయనను అరెస్ట్ చేసి మరింత సమాచారం రాబట్టాలని ఈడీ భావిస్తోంది. తాజా పరిణామాలతో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు  రానున్న రోజులలో ఈడీ మరింత మందిని అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...