ఆర్సీబీ విజయంపై ఈసీ స్పందన.. నెటిజనులు ఫిదా

posted on: Jun 1, 2026 9:09AM

ఐపీఎల్ 2026 సీజన్  చాంపియన్ గా నిలిచిన  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ప్రశంసల వర్షం కురుస్తోంది.  దేశవ్యాప్తంగా  క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.  సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు ఆర్సీబీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  అయితే ఈ భారీ విజయంపై కేంద్ర ఎన్నికల సంఘం   స్పందించిన తీరు  అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.  యువతలో ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు ఈసీ ఆర్సీబీ ఐపీఎల్ చాంప్ గా నిలిచిన సందర్భాన్ని అత్యంత సృజనాత్మకంగా ఉపయోగించుకుంది.  

ఆర్సీబీ అద్భుతవిజయాన్ని ఓటర్ల చైతన్యానికి అనుసంధానిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక  పోస్ట్ పెట్టింది.  ఐపీఎల్ 2026 ట్రోఫీని ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హృదయపూర్వక అభినందనలు. నిజమైన ఛాంపియన్లు ఎప్పుడూ తమ సరైన సమయం కోసం ఎంతో ఓపికగా సిద్ధంగా ఉంటారు. సరిగ్గా అలాగే మీరు కూడా మీ బాధ్యతను నెరవేర్చడానికి సిద్ధం కావాలి. మీకు ప్రస్తుతం 18 ఏళ్లు నిండుతున్నాయా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే ఫారం 6 నింపండి. ఒక ఛాంపియన్‌ తరహాలో మీ ప్రజాస్వామ్య విధిని విజయవంతంగా నెరవేర్చడానికి నడుం బిగించండి. గుర్తుంచుకోండి..  దేశ భవిష్యత్తును మార్చే మీ ఓటు ఎంతో విలువైంది అంటూ ఈసీ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చింది. ఈ ఆసక్తికరమైన పోస్టుకు రన్ మిషన్ విరాట్ కోహ్లీతో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు ఐపీఎల్ ఛాంపియన్ ట్రోఫీతో ఎంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్న ఫొటోను జత చేసింది.  

నిజానికి యువతను ఓటు నమోదు దిశగా ప్రోత్సహించేందుకు,  ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం  సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్)  అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగానే యువతకు బాగా ఇష్టమైన క్రీడలు, పండుగలు, పాపులర్ సినిమాలను ఒక సాధనంగా వాడుకుంటూ దేశంలోని నవతరం ఓటర్లకు మరింత చేరువవ్వడం ఈసీ ప్రధాన వ్యూహం. ఒకవైపు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలనే సందేశాన్ని ఇస్తూనే, మరోవైపు ఆర్సీబీ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ప్రశంసించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

 కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ఈ క్రేజీ పోస్ట్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతంఆసక్తికర చర్చ నడుస్తోంది. దీనిపై నెటిజన్లు, విశ్లేషకుల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈసీ చూపించిన అద్భుతమైన సృజనాత్మకతను,  సమయస్ఫూర్తిని ప్రశంసిస్తుంటే..   మరికొందరు   దేశంలో ఎన్నికల సమర్థవంతమైన నిర్వహణ మరియు ఇరదర కీలకమైన బాధ్యతలపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన ఎన్నికల సంఘం, ఇలాంటి క్రీడా వినోదాలు మరియు ఐపీఎల్ మ్యాచ్ ఫలితాలపై అధికారికంగా స్పందించడం అంత సరికాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తం మీద ఆర్సీబీ విజయంపై ఈసీ ట్వీట్  తెగ వైరల్ అవుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...