హైదరాబాదులో ఈ సిగరెట్ రాకెట్ బట్టబయలు.. ముగ్గురు అరెస్ట్

posted on: Apr 11, 2026 10:47PM

హైదరాబాద్‌లో నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు.  హైదరాబాద్ సిటీ పోలీసులు, టాస్క్ ఫోర్స్ ఖైరతాబాద్ జోన్ బృందం, నాంపల్లి  పోలీసులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి భారీగా ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.

అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు   బజార్‌ఘాట్ ‘ఏ’ బ్యాటరీ లైన్ సమీపంలో పోలీసులు నిఘా ఉంచారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై నిషేధిత ఈ-సిగరెట్లు సరఫరా చేస్తున్న మొహమ్మద్ అహ్మద్‌)ను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో సరుకును స్వీకరించేందుకు వచ్చిన మొహమ్మద్ అస్జాద్ రజాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు అత్తాపూర్‌లోని వినీత్ మంత్రి  నివాసంపై దాడి జరిపి అతడిని కూడా అరెస్ట్ చేశారు.

విచారణలో నిందితులు సోషల్ మీడియాను వినియోగిస్తూ అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. వాట్సాప్,  టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా కస్టమర్లను సంప్రదించి ఆర్డర్లు స్వీకరించేవారని పోలీసులు తెలిపారు. చెల్లింపులు ఫోన్ పే ద్వారా తీసుకుని, సరుకును రాపిడో, పోర్టల్ డెలివరీ సేవలతో పంపిణీ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఢిల్లీకి చెందిన వ్యక్తి నుంచి పార్సిల్ సర్వీస్ ద్వారా ఈ సరుకును పెద్ద మొత్తంలో తెప్పించేవారని కూడా పోలీసులు గుర్తించారు.

ఈ ఆపరేషన్‌లో పోలీసులు మొత్తం 999 ఎలక్ట్రానిక్ సిగరెట్లు, ఒక బర్గ్‌మాన్ ద్విచక్ర వాహనం, నాలుగు మొబైల్ ఫోన్లు,  ప్యాకింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ   రూ.34.03 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...