విశాఖలో భూ ప్రకంపనలు..ఉలిక్కిపడిన నగరవాసులు..!

posted on: Jul 12, 2026 11:19AM

 

విశాఖపట్నం నగరంలో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నగరంలోని సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, పెదవాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్‌బీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు స్పష్టంగా అనుభూతి చెందినట్లు స్థానికులు తెలిపారు. భూమి కొన్ని సెకన్ల పాటు కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల్లో నివసిస్తున్న వారు కంపనాలు మరింత స్పష్టంగా అనిపించాయని చెబుతున్నారు. కొంతమంది ఫ్యాన్లు, తలుపులు, కిటికీలు స్వల్పంగా ఊగినట్లు పేర్కొన్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో పలు కాలనీల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి కొంతసేపు ఆందోళనతో గడిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైనట్లు తెలుస్తోంది. అయితే భూకంప కేంద్రం ఎక్కడ అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూప్రకంపనలపై సంబంధిత అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భూప్రకంపనలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...