చదువుతోపాటే సంపాదన.. ఏపీ ప్రభుత్వ కొత్త స్కీమ్!

posted on: Jun 20, 2026 2:56PM

ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి  ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, చదువుకునే రోజుల్లోనే విద్యార్థులు సొంతంగా సంపాదించుకునేలా ఒక వినూత్న, విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యను నేరుగా ఉపాధితో అనుసంధానం చేస్తూ  ఎంబెడెడ్ డిగ్రీ కోర్సులను పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కోర్సులు చదివే విద్యార్థులకు మూడో ఏడాదిలో నేరుగా కార్పొరేట్ కంపెనీలు, పరిశ్రమలలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తాయి. ఈ విధానం ద్వారా విద్యార్థులు చదువుకుంటూనే నెలనెలా స్టైపెండ్ రూపంలో  ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. 

ఈ సరికొత్త విద్యా విధానానికి సంబంధించిన విధివిధానాలపై ఇటీవల మంగళగిరిలో ప్రభుత్వం,  స్కిల్ కౌన్సిల్ ప్రతినిధులు అత్యున్నత స్థాయి సమావేశంలో   కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడేళ్ల కాలపరిమితి గల ఈ ఎంబెడెడ్ డిగ్రీ కోర్సులలో  చేరిన విద్యార్థులకు మొదటి రెండేళ్లు సాధారణ  అకడమిక్ బోధన ఉంటుంది. ఇందులో సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు ఆధునిక ప్రపంచానికి అవసరమైన ప్రాథమిక డిజిటల్ నైపుణ్యాలపై కాలేజీలోనే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత డిగ్రీ చివరి సంవత్సరం అంటే మూడో ఏడాదిలో విద్యార్థులు నేరుగా క్షేత్రస్థాయి పరిశ్రమలతో అనుసంధానమైన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లోకి అడుగుపెడతారు.

ఈ ఇంటర్న్‌షిప్‌ కోసం విద్యార్థులను ఎక్కడికో పంపించరు. వివిధ స్కిల్ కౌన్సిళ్లు అధికారికంగా సూచించిన ప్రముఖ పరిశ్రమలు, ఐటీ సంస్థలు,  వ్యాపార సంస్థలలోనే ఈ లైవ్ ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ విద్యార్థులు కేవలం పరిశీలకులుగా మాత్రమే కాకుండా, ప్రత్యక్షంగా కంపెనీ పనుల్లో భాగస్వామ్యం అవుతూ రియల్ టైమ్ పని అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకుంటూ పారిశ్రామిక రంగానికి ఎలాంటి ఉద్యోగులు కావాలో అలాంటి నైపుణ్యాలను డిగ్రీ పూర్తికాకముందే సముపార్జించుకుంటారు. దీనివల్ల కాలేజీ నుంచి బయటకు వచ్చే సమయానికే విద్యార్థి చేతిలో మూడేళ్ల డిగ్రీ సర్టిఫికెట్‌తో పాటు ఒక ఏడాది పూర్తిస్థాయి  వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా సిద్ధంగా ఉంటుంది.

ఇక అన్నిటికంటే ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే, ఈ వన్ ఇయర్ ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులకు అందించే స్టైపెండ్.  ఈ కాలంలో ప్రతి నెలా   6 వేల 900 నుంచి 15 వేల రూపాయల వరకూ కంపెనీల నుంచి నేరుగా విద్యార్థుల అకౌంట్లలో జమ అవుతుంది. ఈ ఆర్థిక తోడ్పాటు గ్రామీణ,   మధ్యతరగతి విద్యార్థులకు తమ సొంత ఖర్చుల కోసం ఎవరిపైనా ఆధారపడకుండా నిలబడేలా చేస్తుంది.

ఇక ఇంటర్న్ షిప్  వారిలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఒక బలమైన బూస్ట్ లా పనిచేస్తుంది. ఈ పద్ధతి వల్ల చదువు పూర్తయ్యే నాటికే ప్రతి విద్యార్థి కార్పొరేట్ ఉద్యోగాలకు 100 శాతం అర్హత సాధిస్తారు.  ఆంధ్రప్రదేశ్‌లోని ఆయా జిల్లాల్లో ఉన్న పారిశ్రామిక క్లస్టర్ల అవసరాలను బట్టి, అక్కడ ఏ రకమైన ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయో చూసి, వాటికి తగినట్లుగా సరికొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యామండలి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసింది. చదువుతో పాటు నైపుణ్యం, చేతినిండా ఆదాయం ఇచ్చే ఈ సరికొత్త పథకం ఏపీలో నిరుద్యోగ సమస్యను సమూలంగా నిర్మూలించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...