ఏసీబీ సోదాల్లో సంచలనం..డీఎస్పీ భీమ్ రెడ్డి ఆస్తులు రూ.300 కోట్లకు పైగా...!

posted on: Jul 2, 2026 9:39PM

 

తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS), హైదరాబాద్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీమ్ రెడ్డిపై అక్రమాస్తుల కేసు నమోదవడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. తెలిసిన చట్టబద్ధమైన ఆదాయ వనరులకు మించి అవినీతి, అక్రమ మార్గాల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అవినీతి నిరోధక చట్టం–1988 (2018 సవరణ)లోని సెక్షన్ 13(1)(బి), 13(2) కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా జూలై 2న భీమ్ రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలు, అనుచరులకు చెందిన మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్ వెస్సెల్లా మెడోస్‌లో ఒక విల్లా, టెలికాం నగర్‌లో జీ+2+పెంట్ హౌస్‌తో కూడిన నివాస భవనం, సాయి ప్రభా రెసిడెన్సీలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో క్రాంతి సియోన్ అపార్ట్‌మెంట్స్‌లో మరో ఫ్లాట్, మణికొండ లాంకోహిల్స్ రోడ్డులో జీ+5 వాణిజ్య సముదాయంలో 500 చదరపు గజాల వాటా, మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో 3,000 చదరపు అడుగుల వాణిజ్య స్థలం, తెల్లాపూర్‌లో అభినంద రెసిడెన్సీలో రెండు ఫ్లాట్లు, ప్రగతి రిసార్ట్స్ సమీపంలో 500 చదరపు గజాల ఖాళీ ప్లాట్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, 

కర్ణాటకలో 6 ఎకరాలు మరియు మరో 38 ఎకరాల వ్యవసాయ భూములు, బెంగళూరు దేవనహళ్లిలో ఒక ఎకరం భూమి, నాగోల్ కామినేని ఆసుపత్రి సమీపంలో 200 చదరపు గజాల ప్లాట్, పటాన్‌చెరు జీపీఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 చదరపు గజాల ప్లాట్, పటాన్‌చెరులో మరో 200 చదరపు గజాల ప్లాట్, వికారాబాద్ జిల్లా మొమిన్‌పేట్‌లో 1,000 చదరపు గజాల స్థలం, రెండు ఎకరాల వ్యవసాయ భూమి, ఎం/ఎస్ శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్ సంస్థలో రూ.75 లక్షల పెట్టుబడి, అలాగే సీసీ కుంట మండలం ముచింతల గ్రామంలో 4.20 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించారు.

సోదాల సందర్భంగా భీమ్ రెడ్డి ఇంట్లో సుమారు రూ.3.60 లక్షల నగదు, ఆయన బినామీ నివాసంలో మరో రూ.40 లక్షల నగదు లభించింది. అదేవిధంగా సుమారు రెండు కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, బ్యాంకు ఖాతాల్లో రూ.19.91 లక్షల నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భీమ్ రెడ్డి నివాసంలో 23 విదేశీ మద్యం (ఫారిన్ లిక్కర్) బాటిళ్లు కూడా లభించడంతో తదుపరి చర్యల కోసం సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సోదాల్లో గుర్తించిన స్థిరాస్తుల మార్కెట్ విలువ పత్రాల్లో నమోదైన విలువ కంటే అనేక రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం భీమ్ రెడ్డికి సంబంధించిన మొత్తం ఆస్తుల మార్కెట్ విలువ దాదాపు రూ.300 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇంకా కొన్ని ఆస్తుల ధృవీకరణ ప్రక్రియ కొనసాగుతోందని, స్వాధీనం చేసుకున్న పత్రాలు, బినామీ పెట్టుబడులు, బ్యాంకు లావాదేవీలు తదితర అంశాలపై లోతైన విచారణ కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...