దొంగనే దోచుకున్న ఖాకీ దొంగలు!

posted on: Aug 20, 2016 2:51PM


కనిపించని నాలుగు సింహమేరా పోలీస్... ఈ డైలాగ్ సాయికుమార్ బేస్ వాయిస్ లో ఫుల్ గా పాప్యులర్ అయిపోయింది! సాయికుమార్ చేసిన అగ్ని క్యారెక్టర్ లాంటి సింహం వంటి పోలీసులు చాలా మందే వుంటారు డిపార్ట్ మెంట్లో. కాని, పాపం అలాంటి సిన్సియర్ పోలీసాఫీసర్ల పరువు తీసేవారు కూడా అదే శాఖలో వుంటుంటారు! ఈ జాదు పోలీస్ అలాంటి వాడే...

 

పేరు బాలు జాదవ్. గతంలో కూడా అనేక జాదులు చేశాడని పేరున్న ఈ డీఎస్పీ స్థాయి అధికారి ఈసారి ఏకంగా ఎంసెట్ లీకేజీ కేసులోనే వెలెట్టాడు! ప్రస్తుతం సీఐడీ డిపార్ట్ మెంట్లో పనిచేస్తున్న బాలు మహబూబాబాద్ కి వెళ్లి పేపర్ లీకేజీకి కారణమైన ఓ దళారిని పట్టుకోవాలి. కాని, తీరా అక్కడికి వెళ్లాక సదరు బ్రోకర్ ని బెదిరించి మూడు లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. ఆ డబ్బిస్తే దొంగ దొరకలేదని చెప్పేస్తానంటూ అభయమిచ్చాడు. కాని, అంత డబ్బు దళారి వద్ద లేకపోవటంతో సమస్య ఎదురైంది.
బాలు జాదవ్ హెడ్ కానిస్టేబుల్ సదాశివరావుతో కలిసి దళారి వెంకటేష్ ను భయపట్టి అతడి ఏటీఎం కార్డులన్నీ గీయించి లక్ష రూపాయలు డ్రా చేయించాడు! అవ్వి జేబులో పెట్టుకుని ఆఫీస్ కి వెళ్లి జాదు జాదవ్ దళారి దొరకలేదని చెప్పేశాడు. ఇలా దొంగలతో కుమ్ముక్కై ఎన్నిసార్లు వదిలిపెట్టాడో తెలియదుగాని ఈ సారి మాత్రం పై అధికారులకి మనోడి వ్యవహారంపై డౌట్ వచ్చింది.

 

వేరే పోలీసుల్ని పంపటంతో దళారి వెంటేష్ అరెస్ట్ అయ్యాడు. ఇంటరాగేషన్ లో మన జాదు డీఎస్పీ గారి కహానీ మొత్తం విప్పి చెప్పాడు. డబ్బులు డ్రా చేసిన ఏటీఎంలలో సీసీ కెమెరా ఫీడ్ చూటంతో అయ్యగారు క్లియర్ గా దొరికిపోయారు! ఇంకేముంది డీజీపీ అనురాగ్ శర్మ దొంగనే దోచిన తోడు దొంగలు డీఎస్పీ, హెడ్ కానిస్టేబుల్ ఇద్దర్నీ సస్పెండ్ చేశారు! విది నిర్వహణలో ప్రాణాలు సైతం త్యాగం చేసే ఎంతో మంది పోలీసులున్న డిపార్ట్ మెంట్లో ఇలాంటి జాదు డీఎస్పీలు, హెడ్ కానిస్టేబుల్స్ నిజంగా పెద్ద కళంకమే. వీరి వల్లే సామాన్య జనం రౌడీల కంటే ఎక్కువగా పోలీసుల్ని చూసి భయపడిపోతుంటారు... మన దేశంలో!  

 

google-ad-img
    Related Sigment News
    • Loading...