ఏటీఎం నగదు దోపిడీ కేసులో దర్యాప్తు ముమ్మరం

posted on: Feb 16, 2026 2:04PM

 

హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో ఎటీఎం క్యాష్ వాహనంలో భారీ నగదు దోపిడీ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... ఈ కేసులో డ్రైవర్ ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాలేదు. రూ.60 లక్షల నగదుతో పరారైన డ్రైవర్ అజీత్ అలియాస్ శివ్ కోసం సైబరాబాద్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఘటన జరిగి రెండు రోజులు గడిచినా  కూడా ఇంతవరకు నిందితుడి ఆచూకీ లభించకపో వడంతో దర్యాప్తు మరింత వేగవంతం చేశారు.

గోపన్‌పల్లి ప్రాంతంలోని ఎటీఎం నుంచి నగదు లోడింగ్ చేసిన అనంతరం CMS క్యాష్ వాహనంతో బయలుదేరిన డ్రైవర్, కోల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్ సమీపంలో వాహనాన్ని వదిలి నగదుతో పరారయ్యాడు. ఆ తర్వాత అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసులకు అనుమానాలు మరింత పెరిగాయి.ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించిన సైబరాబాద్ పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికే వందకు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీ లించినట్టు సమాచారం. డ్రైవర్ కదలికలను గుర్తించే దిశగా సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు.

ఆరు నెలల క్రితమే ఉద్యోగంలో చేరిన అజీత్ ఈ దోపిడీకి పాల్పడటం గమనార్హంగా మారింది. అతనికి ఈ చోరీలో మరెవరైనా సహకరించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. క్యాష్ వాహనాన్ని వదిలి వెళ్లిన ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలు కీలకంగా మారనున్నాయి. నిందితుడి పరారికి ఉపయోగించిన మార్గాలు, అతనికి సహకరించిన వ్యక్తులపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఘటనతో నగరంలో ఎటీఎం క్యాష్ రవాణా భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...