విశ్వవిఖ్యాత నటసార్వభౌముడితో విశ్వంభరుడి అనుబందం!

 

తన విశ్వంభర కావ్యంతో తెలుగు సాహిత్య ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసిన గొప్ప కవి సినారె. జ్ఞానపీఠ్ అవార్డ్ పొందిన ఆయన 85ఏళ్ల వయస్సులో చివరి శ్వాస దాకా ఉత్తమమైన సాహిత్యాన్ని తెలుగు నేలపై వెదజల్లుతూనే వున్నారు. అయితే, సినారె ఎన్నో కావ్యాలు, గేయాలు, గ్రంథాలు రాసినప్పటికీ…. ఆయన గురించి సామాన్య జనానికి తెలిసింది మాత్రం సినిమా పాటల రచయితగానే! ఒకవేళ ఆయన సినిమా రంగంలోకి కాలుమోపకుంటే బహుశా ఇంత మందికి దగ్గరయ్యేవారే కాదేమో!

 

సి. నారాయణ రెడ్డి తమదైన పంథాలో సాహిత్య సృష్టి చేస్తూ ముందుకు సాగుతుంటే సినిమా రంగంలోకి ఆహ్వానించింది ఎవరో తెలుసా? నటసార్వభౌమ ఎన్టీఆర్! ఆయన పట్టుబట్టి సినారె చేత సినీ గీతం రాయించారు. అలా చరిత్రలో స్థానం సంపాదించుకున్నదే గులేబకావళి కథలోని నన్ను దోచుకుందువటే పాట! సినారెని బీ.ఎన్.రెడ్డి లాంటి గొప్ప దర్శకులు సినిమా పాటలు రాయమన్నా ఆయన సున్నితంగా తిరస్కరించారు. కాని, అన్నగారు రమ్మన్నాక కాదనలేకపోయారు. అదే సినారె మూడు వేల అయిదు వందల ఆణిముత్యాల్లాంటి పాటలు రాయటానికి కారణమైంది!

 

ఎన్టీఆర్ కి సినారెపైన కేవలం వృత్తిపరమైన గౌరవమే కాదు…. వ్యక్తిగతంగా ఎంతో ప్రేమ వుండేది. ఆయన స్వయంగా మద్రాస్ రైల్వే స్టేషన్ కు వెళ్లి ఆయన్ను ఆహ్వానించే వారంటే తారక రాముడి భావం మనం అర్థం చేసుకోవచ్చు! అంతే కాదు, అప్పట్లో యావత్ టాలీవుడ్ ను తిరుగులేకుండా ఏలుతోన్న ఎన్టీఆర్ సినారె పెట్టిన షరతుకు ఒప్పుకుని అన్ని పాటలూ ఆయనతోనే రాయించుకునే వారు కూడా! మరో రచయిత పేరు లేకుండా సింగిల్ కార్డ్ వేస్తేనే తాను పాటలు రాస్తానని అనేవారట సినారె. ఇక నారాయణ రెడ్డి తమ కెరీర్ మొత్తంలో మాటలు రాసిన రెండే రెండు సినిమాలు ఏకవీర్, అక్బర్, సలీం, అనార్కలీ. ఇవి రెండూ ఎన్టీఆర్ వే కావటం సినారెకు ఆయనతో వున్న అనుబంధాన్ని మనకు సూచిస్తుంది!

 

అన్నగారు సీఎం అయ్యాక కూడా నారాయణ రెడ్డితో అనుబంధం తగ్గలేదు. మరింత పెరిగింది కూడా. హుస్సేన్ సాగర్ పైన తెలుగు ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు, వారికి సంబంధించిన కవిత పంక్తులు… వీటి వెనుక కూడా సినారె హస్తం వుందంటారు. ఇక ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించిన తెలుగు విశ్వవిద్యాలయానికి కూడా సినారె వైస్ ఛానల్సర్ గా పని చేసిన విషయం తెలిసిందే!

 

సినారె పట్ల ఎన్టీఆర్ అభిమానం తెలియాలంటే… ఆయన పిలుపు గుర్తుకు చేసుకుంటే చాలు! నటరత్నీ ఈ సాహితీ రత్నాన్ని ‘’ మా రెడ్డిగారు ‘’ అనేవారు ఆప్యాయంగా!