విశాఖలో వినూత్న వైద్యం…కంటైనర్‌లోనే క్యాన్సర్ చికిత్స!

posted on: Apr 19, 2026 4:24PM

 

వైద్య వృత్తిని కేవలం వృత్తిగా మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతగా భావించే వ్యక్తులు అరుదుగా ఉంటారు. అటువంటి కోవకే చెందుతారు ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ దిగుమర్తి రఘునాథరావు. విశాఖపట్నం శివార్లలోని అగనంపూడిలో, ఒక భారీ ఆసుపత్రి నిర్మాణం జరగకముందే.. క్యాన్సర్ రోగుల బాధలను చూసి చలించిపోయి, తన సొంత ఖర్చుతో ఆయన చేపట్టిన చికిత్సా విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

విశాఖలో జాతీయ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించినా, నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. ఆ సమయం వృధా కాకూడదని భావించిన డాక్టర్ రఘునాథరావు, తన భార్య డాక్టర్ లీలతో కలిసి రంగంలోకి దిగారు. ఏకంగా ఎనిమిది కంటైనర్లను వైద్య కేంద్రాలుగా మార్చి, అత్యాధునిక క్యాన్సర్ సేవలను పేద రోగులకు అందించడం ప్రారంభించారు. ఆసుపత్రి భవనం సిద్ధమయ్యే వరకు రోగులు చికిత్సకు దూరంగా ఉండకూడదన్నదే వారి సంకల్పం.

నిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగాన్ని స్థాపించి, తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన ఘనత ఆయనదే. క్యాన్సర్ మందులు సామాన్యులకు అందుబాటులోకి రావడంలో ఆయన చేసిన కృషి వెలకట్టలేనిది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాలియేటివ్ కేర్, హాస్పైస్ సేవలను ప్రవేశపెట్టడంలోనూ ఆయన అగ్రగామిగా నిలిచారు.

కేవలం చికిత్స మాత్రమే కాకుండా, రోగులకు ఉచిత భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించడం కోసం దాతల సహాయం తీసుకున్నారు. ఆయన స్థాపించిన ఫౌండేషన్ ద్వారా పల్లెల్లోని బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌లు ఉచితంగా అందించే కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతోంది.

2021లో విశాఖలో హోమీబాబా రీసెర్చి క్యాన్సర్ హాస్పిటల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో, తాను నిర్మించిన కంటైనర్ ఆసుపత్రి నిర్వహణను కొత్త బృందానికి అప్పగించారు. ఈ క్రమంలో ఆయన తన సొంత డబ్బుతో ఖర్చు చేసిన మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి ఇచ్చినా, ఆ నిధులను కూడా రోగుల సంక్షేమానికే విరాళంగా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు.

నిస్వార్థమైన సేవలకు మారుపేరుగా నిలిచిన డాక్టర్ రఘునాథరావు జీవితం, నేటి వైద్యులకు, సమాజానికి గొప్ప స్ఫూర్తి. భవిష్యత్తులోనూ ఆయన మరిన్ని సామాజిక కార్యక్రమాలతో పేదలకు అండగా నిలుస్తారని ఆశిద్దాం.

google-ad-img
    Related Sigment News
    • Loading...